కోవిడ్-19పై పోరుకు మోడీ సర్కార్ తీసుకున్న చర్యలు భేష్: ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఐక్యరాజ్య సమితి: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా దేశ ప్రభుత్వాలు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించాయి. అయితే ఈ సమయంలో ఆయా ప్రభుత్వాలు ఎలా డీల్ చేస్తున్నాయనేదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్ష నిర్వహించింది. ఇందులో భాగంగానే మోడీ ప్రభుత్వం కరోనావైరస్ మహమ్మారి పోరుపై తీసుకున్న చర్యలను కొనియాడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సమీక్షపై మీడియా సమావేశం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
ఈ మహమ్మారిని పారద్రోలడంలో జాగ్రత్త చర్యలు చాలా అవసరమని చెప్పిన ఆయన ఇందులో మోడీ సర్కార్ వ్యవహరించిన తీరు భేష్ అని కొనియాడారు. అసలే ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో రోజువారీ కూలీలను సైతం విస్మరించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను డాక్టర్ టెడ్రాస్ కొనియాడారు.
ఈ కష్టసమయంలో ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు గతవారం మోడీ ప్రభుత్వం రూ.1.7 లక్షల కోట్లను ప్యాకేజీగా ప్రకటించడాన్ని డాక్టర్ టెడ్రాస్ స్వాగతించారు. ఇలాంటి సమయాల్లో అలాంటి సహకారంనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారని చెప్పారు. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇటువంటి విపత్కర సమయాల్లో ఇతర దేశాలకు సహాయం చేయలేవని వారు చేయాల్సినదల్లా ఇతర దేశాలకు రుణాల నుంచి విముక్తి కల్పించడమే అని చెప్పారు.
ఇదిలా ఉంటే లాక్డౌన్ ప్రభావం భారత్లో ఎలా ఉందనేది ఇప్పుడప్పుడే అంచనా వేయలేమన్నారు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్. లాక్డౌన్, షట్డౌన్లు కరోనావైరస్పై విజయం సాధించేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలని ఆయన చెప్పారు. కొంత సమయం వరకు లాక్డౌన్ను విధించాల్సిందేనని చెప్పిన ర్యాన్... ఆ తర్వాత పరిస్థితులు ఏమేరకు మారుతాయో చూడాలన్నారు.
Recommended Video
ఇదిలా ఉంటే పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని డాక్టర్ టెడ్రాస్ చెప్పారు. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో 50వేల మరణాలతో పాటు పాజిటివ్ కేసులు 10 లక్షలకు చేరుకుంటాయని అంచనా వేశారు డాక్టర్ టెడ్రాస్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవాళికి అతిపెద్ద ముప్పుగా కరోనావైరస్ పరిణమించిందని అభిప్రాయపడ్డారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గటెరర్స్. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు.