కనిపిస్తే అరెస్ట్ : మిగతా సంస్థల వెన్నులో వణుకు, మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్తో కలిగే లాభాలివే
న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. అయితే దీంతో భారత్కు కలిగే ప్రయోజనమేంటీ ? ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాదులపై ఏం చర్యలు తీసుకుంటారనే చర్చకు దారితీసింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదులపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయనే అంశంపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
నిధులకు బ్రేక్
ఓ ఉగ్రవాద సంస్థ పెట్రేగిపోవాలంటే నిధులు కావాలి. ఇస్లామిక్ దేశాలు, సంస్థల నుంచి ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహం కొనసాగుతుంటుంది. అయితే మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించడంతో జైషే మహ్మద్ సంస్థకు నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. వచ్చే నిధులు రావు, ఉన్న నిధులు తీసుకొని పరిస్థితి. దీంతో ఆ సంస్థ కొత్తగా యువతను తమ సంస్థలో చేర్చుకొని ట్రైనింగ్ ఇచ్చే సాహసం చేయదు. అంతేకాదు ఇప్పటికే ఉన్న ఉగ్రవాదులను కూడా సరిగా చూడని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో క్రమంగా ఆ సంస్థ నిర్వీర్యమైపోయే సిచుయేషన్ ఉంటుంది.
కనిపిస్తే అరెస్ట్
ఓ వైపు నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. మరోవైపు జైషే సంస్థ చీఫ్, ఉగ్రవాదులు పర్యటించే సమయంలో అరెస్ట్ చేస్తారు. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు .. యూఎన్ వో ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకుంటాయి. ఇప్పటివరకు అలాంటి నిషేధం లేనందున మసూద్ .. ఆయన అనుచరులు తిరిగినా .. పట్టనట్టు వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదు.
మిగతా సంస్థల్లో వణుకు
జైషే మహ్మద్ సంస్థను అష్టదిగ్భందనం చేయడంతో మిగతా ఉగ్రవాద సంస్థలు కూడా హడలిపోతాయి. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్దిన్ సంస్థలు తమను కూడా నిషేధం విధిస్తారని భయంతో ఉంటాయి. పేలుళ్లు, కాల్పులు జరిపేందుకు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఉపఖండంలో ఉగ్రవాదం సమూలంగా నియంత్రించే అవకాశం నెలకొంటుంది.
శ్రీలంక ఘటనతో కళ్లు తెరిచింది
ఇటీవల శ్రీలంకలో ఐఎస్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడింది. వాస్తవానికి శ్రీలంకతో ఇతర దేశాలకు గానీ, ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదు. కానీ ఆదివారం పూట అలజడి సృష్టించి పేలుళ్లుకు పాల్పడింది. దీంతో డ్రాగన్ చైనా కూడా భయపడినట్టుంది. తాము కాపాడుతున్న జైషే సంస్థ .. తమ దేశంపై ఎక్కడ దాడి చేస్తుందనే భావించి ... ఇప్పటివరకు చూపిన సాంకేతి కారణాలను వెనక్కి తీసుకుంది. దీంతో మసూద్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
మారిన వైఖరి .. కారణమిదే ..
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ పై చైనా వల్లమాలిన ప్రేమ కనబరిచింది. ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఇప్పటికే నాలుగుసార్లు కోరంది. 2009లో యూపీఏ సర్కార్ నుంచి మొన్న మార్చిలో మోదీ వరకు విన్నవించింది. పుల్వామా దాడి జరిగిన తర్వాత తాత్కాలిక సభ్య దేశమైన భారత్ ప్రతిపాదన మేరకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా .. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని తీర్మానం చేశాయి. అయితే డ్రాగన్ చైనా సాంకేతిక కారణాలు చూపి వీటో పవర్ ఇన్నాళ్లు ఆపింది. అయితే ఇటీవల శ్రీలంకలో ఉగ్రవాదుల దాడితో ఉలిక్కిపడిన చైనా ... తమ దేశంపై కూడా ఎక్కడ ఉగ్రవాదులు దాడిచేస్తారోనని భావించి సాంకేతిక కారణాల ప్రక్రియను వెనక్కి తీసుకుంది. దీంతో మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా యూఎన్ వో ప్రకటించింది.