1947లో బ్రిటిషర్స్ ఎందుకెళ్లిపోయారంటే.. (వీడియో)
ఢిల్లీ: 1947లో ఎందుకు వదిలి వెళ్లారనే విషయమై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1945లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న సమయంలో బ్రిటిషర్లు భారత్కు స్వాతంత్య్రం ప్రకటించడం వెనుక పెద్ద కారణముందని దోవల్ చెబుతున్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నాడు అతివాదిగా ముద్రపడి దేశం వదిలి వెళ్లిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యూహాలకు సతమతమైన కారణంగానే బ్రిటిషర్లు భారత్ నుంచి వెళ్లిపోయారని చెప్పారు.
నాడు నేతాజీ స్వయంగా భారత సైన్యంలో రేపిన చిచ్చుకు భయపడి బ్రిటిషర్లు వెళ్లిపోయారన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిషర్లు రెట్టించిన ఉత్సాహంతో భారత్లో పాలన చేయాల్సింది పోయి, ఎలాంటి పెద్ద కారణం లేకుండా వెళ్లిపోవడానికి కారణంగా నేతాజీయేనని పేర్కొన్నారు.
దోవల్ ప్రసంగానికి సంబంధించి ఆరు నిమిషాల నిడివి ఉన్న వీడియో యూట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. 1945 ఆగస్టు 18న తైవాన్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయిననట్లు 1945 ఆగస్టు 18న టోక్యో రేడియో ప్రకటించింది. అయితే, నేతాజీ మద్దతుదారులు దానిని కొట్టిపారేశారు.