కరోనా వైరస్ : రష్యా ఎందుకంత ఎఫెక్ట్ అవలేదు.. పుతిన్ లెక్కల్లో నిజమెంత..?
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. కరోనా బారినపడ్డ చాలా దేశాలు దాదాపుగా స్తంభించిపోతున్న పరిస్థితి. ఇటలీ,ఇరాన్లలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటు భారత్లోనూ కరోనా భయాందోళనను చూస్తూనే ఉన్నాం. అయితే ప్రపంచ దేశాలన్నీ ఇంతలా భయపడిపోతున్నా.. చైనా పక్కనే ఉన్న రష్యా మాత్రం వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో విజయవంతమైంది. ఆ దేశంలో కేవలం 301 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న చర్యలే రష్యాను కరోనా బారి నుంచి కాపాడాయని చెబుతున్నారు.
కేవలం 253 కేసులు మాత్రమే
చైనాతో రష్యా దాదాపు 2600 మైళ్ల సరిహద్దును కలిగి ఉంది. రష్యా జనాభా దాదాపు 14 కోట్ల పైచిలుకు. అయితే లగ్జంబర్గ్ లాంటి కేవలం 6లక్షల పైచిలుకు జనాభా కలిగిన దేశంతో పోలిస్తే రష్యాలో నమోదైన కేసులు చాలా తక్కువ. లగ్జంబర్గ్లో 670 పాజిటివ్ కేసులు,8 మరణాలు సంభవించగా.. రష్యాలో 253 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా కారణంగా రష్యాలో మరణాలేవీ సంభవించలేదు.
తక్కువ కేసులకు కారణమేంటి..
కరోనా తక్షణ నియంత్రణ చర్యల్లో భాగంగా చైనాతో 2600 మైళ్ల సరిహద్దును జనవరి 30వ తేదీనే రష్యా మూసివేసింది. అలాగే ఎక్కువ సంఖ్యలో క్వారెంటైన్ జోన్స్ను ఏర్పాటు చేసింది. అలాగై విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించడం,పాజిటివ్ కేసులను గుర్తించడం,వెంటనే ఐసోలేషన్కు తరలించడం వంటి చర్యల ద్వారా రష్యాలో కరోనా ప్రభావం తక్కువగా ఉందని రష్యాలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డా.మెలిటా వుజ్నోవిక్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 156,000 కరోనావైరస్ పరీక్షలను నిర్వహించినట్టు రష్యా వినియోగదారుల పరిశీలకుడు రోస్పోట్రెబ్నాడ్జోర్ వెల్లడించారు.
పాజిటివ్ కేసులన్నీ ఇటలీ నుంచి వచ్చినవారే..
CDC గణాంకాల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ మార్చి ప్రారంభంలో మాత్రమే కరోనా పరీక్షల్లో ఆశించిన వేగం కనిపించింది. అదే సమయంలో రష్యా ఫిబ్రవరి ఆరంభం నుంచే అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించింది. ముఖ్యంగా ఇరాన్, చైనా, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ఈ చర్యలను చేపట్టడం సత్ఫలితాలను ఇచ్చింది. అయితే మొదట్లో ఇటలీ నుంచి వచ్చే ప్రయాణికులకు రష్యా స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించలేదు. కేవలం యూరోప్ నుంచే వచ్చే ప్రయాణికులకు మాత్రమే టెస్టులు నిర్వహించింది. ఇప్పుడు రష్యాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం ఇటలీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.
రష్యా అబద్దం చెబుతోందా.. సొంత దేశస్తులనే మోసం చేస్తోందా..
కరోనా వైరస్ విషయంలో రష్యా చెబుతున్న లెక్కలపై సందేహాలు కూడా లేకపోలేదు. సొంత దేశం ప్రజలే సోషల్ మీడియాలో ప్రభుత్వం లెక్కలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1986లో జరిగిన చెర్నోబిల్ అణువిపత్తును కప్పి పుచ్చుకున్నట్టుగా.. 1980లో హెచ్ఐవి/ఎయిడ్స్ కేసుల్లో ప్రభుత్వ పేలవ వైఖరి నేపథ్యంలో కరోనా విషయంలోనూ సొంత దేశస్తులకే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది జనవరిలో మాస్కోలో నిమోనియా కేసుల సంఖ్య గతేడాదితో పోల్చితే 37శాతం పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా 3శాతం పెరిగినట్టు వెల్లడించింది. అప్పటినుంచి రష్యా హెల్త్ విభాగం అప్రమత్తమై లెక్కలను తగ్గించి చెబుతోందని రాయిటర్స్ ఒక కథనంలో పేర్కొంది. జనవరిలో నిమోనియా కేసులు 8శాతం పడిపోయాయని,ఫిబ్రవరిలో 7శాతం పడిపోయాయని వెల్లడించినట్టు తెలిపింది. అయితే అధ్యక్షుడు పుతిన్ మాత్రం రష్యాలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోనే ఉందని వెల్లడించడం గమనార్హం.