కరోనా : పిట్టల్లా రాలుతున్న జనం... ఇటలీ ఎందుకింతలా విలవిల్లాడుతోంది..
కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఇటలీ ఎంతలా అతలాకుతలమైందో అందరికీ తెలిసిందే. కేవలం ఆరు కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఇప్పటివరకూ 19,64,054మంది కరోనా బారినపడ్డారు. దాదాపు 69,214 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. జనాభా పరంగా చూస్తే కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాల్లో ఇటలీనే టాప్లో ఉందని చెప్పవచ్చు. ఇక్కడ నిత్యం సరాసరి 611 మంది కరోనాతో మరణిస్తున్నారు. మొత్తంగా కరోనాతో సంభవిస్తున్న మరణాల్లో అమెరికా,బ్రెజిల్ దేశాల తర్వాత ఇటలీ మూడో స్థానంలో ఉంది.
యూరోప్ దేశాల్లో ఇటలీలో మాత్రమే ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ప్రజా ఆరోగ్య నిపుణులు చెప్తున్న ప్రకారం... ప్రపంచంలో జపాన్ తర్వాత అత్యధికంగా వృద్ద జనాభాను కలిగిన దేశం ఇటలీ. ఇక్కడ ప్రతీ నలుగురిలో ఒకరు 65 ఏళ్ల పైబడ్డవారు ఉన్నారు. ఈ వయసు గ్రూపు వారికి కరోనా త్వరగా సోకడం,మరణించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఇటలీలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి.
ఇప్పటివరకూ ఇటలీలో కరోనాతో సంభవించిన మరణాల్లో 95శాతం మంది 60 ఏళ్ల పైబడ్డవాళ్లు కాగా...86శాతం మంది 70 ఏళ్లు పైబడ్డవారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతీ లక్ష జనాభాకు 15.9శాతం మంది కరోనాతో మృత్యువాతపడుతున్నారు. స్పెయిన్లో ఇది 6.3శాతం,జర్మనీలో 6.9శాతం,ఫ్రాన్స్లో 8.3శాతం ఉండటం గమనార్హం.
ఇటలీలో మనిషి సగటు ఆయుర్దాయం 83 సంవత్సరాలు. అయితే 65 ఏళ్లు పైబడ్డ దాదాపు 70శాతం మంది కనీసం రెండు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా వృద్దాప్యంలో అనారోగ్యం దరిచేరడం కూడా కరోనా బలితీసుకోవడానికి కారణాలుగా చెప్తున్నారు.
ఇటలీలో ఇప్పటికీ రెండు,మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో నివసించడం సర్వ సాధారణం. ఈ కారణంగా ఆ ఇళ్లల్లోని యువతీ,యువకుల నుంచి వృద్దులకు త్వరగా కరోనా సోకుతోంది. కాబట్టి ఇటలీలో సంభవిస్తున్న మరణాలకు ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. అలాగే అనుకోని ఆరోగ్య విపత్తును ఎదుర్కోవడంలో వైద్య రంగంపై ఒత్తిడి తీవ్రమవడం... ఆరోగ్య సిబ్బంది కొరత తదితర సమస్యలు కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణంగా చెప్తున్నారు. కరోనా సెకండ్ వేవ్తో ఇటలీలో మృత్యు ఘంటికలు తీవ్రమవడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.