అండర్వేర్లతో మహిళలు నిరసనలు..!
ఐర్లాండ్ : ఐర్లాండ్లో ఓ వినూత్న నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఇది కొంచెం జుగుప్సాకరంగానే ఉండొచ్చు కానీ విషయం తెలుసుకుంటే కాస్త ఇంట్రస్టింగ్గా ఉంటుంది. ఇంతకీ ఐర్లాండ్లో జరిగిన వినూత్న నిరసన ఏమిటి... ఎవరు చేశారు... వారు ఎందుకు చేశారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అండర్ వేర్తో నిరసన
ఐర్లాండ్లో ఓ మహిళా రాజకీయ నాయకురాలు వినూత్న నిరసనకు దిగింది. ఐర్లాండ్ పార్లమెంటులో ఆమె ఓ నల్ల రంగు అండర్ వేర్ (లోదుస్తులు)ను గాల్లోకి ఊపుతూ నిరసన తెలిపారు. ఈమెను చూసిన మిగతా మహిళలు కూడా తమ ప్యాంటీలతో నిరసన తెలుపుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళలు ఎందుకలా చేశారో తెలుసుకునేందుకు నెటిజెన్లు విపరీతంగా సెర్చ్ చేశారు. అంతేకాదు తమ అండర్వేర్లు పట్టుకుని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు.
ఎందుకోసం ఈ నిరసన ?
ఇక అసలు విషయానికొస్తే... ఇదంతా ఓ అత్యాచార ఘటనతో ముడిపడి ఉంది. కార్క్ నగరంలో తనపై అత్యాచారం జరిగినట్లు 17 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడి తరుపున న్యాయవాది ఓ కోర్టులో వింత వాదన వినిపించారు. అమ్మాయి అప్పటికే మరొకరితో లైంగికంగా కలిసేందుకు సిద్ధపడిందని... ఇందుకు నిదర్శనం ఆమె వేసుకున్న అండర్ వేరే అని లాయరు తన వాదనలు వినిపించారు. ఆమె వేసుకున్న బట్టలను పరిగణలోకి తీసుకోవాలంటూ జడ్జిని కోరారు.
అమ్మాయిలు ఏ దుస్తులు ధరించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదా..?
న్యాయవాది లేవనెత్తిన అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ రాజకీయనాయకురాలు. ఓ వైపు అమ్మాయిపై అత్యాచారం జరిగిందన్న విషయం మరిచి అమ్మాయి ధరించిన దుస్తులపై దృష్టి పెట్టడమేంటంటూ ప్రశ్నించింది. అంటే మహిళలు తాము ధరించే దుస్తులను ఎంపిక చేసుకోవడం తప్పా అంటూ ప్రశ్నించారు. అయినా అమ్మాయి లైంగికంగా కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవరు చెప్పారని ఆమె ధ్వజమెత్తారు. అంతేకాదు ప్రతి విషయంలో ఐర్లాండ్లో నివసించే మహిళలదే తప్పు అన్నట్లుగా వేలెత్తి చూపడం సరికాదన్నారు. అంతేకాదు ఇలాంటి విషయాలపై చట్టాలు తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని ఆరోపించారు.
కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం: ప్రధాని లియో
ఇదిలా ఉంటే దీనిపై ఐరిష్ ప్రధాని లియో వరాద్కర్ స్పందించారు. ఇది ఒక్కరి సమస్య కాదని దేశవ్యాప్తంగా ఉన్న మహిళల సమస్యగా చూస్తున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు లైంగిక దాడులు, వేధింపులపై కఠిన చట్టాలు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాదు న్యాయపరంగా కూడా పలు చట్టాలను తీసుకువస్తామని ప్రధాని చెప్పారు. అత్యాచార కేసుల్లో విచారణ కూడా త్వరతగతిని పూర్తయి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
నిందితుడు నిర్దోషి అని తీర్పు.. ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు
మరోవైపు అత్యాచార ఘటనలో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది న్యాయస్థానం. ఈ కేసును సెంట్రల్ క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో ఎనిమిది పురుష జడ్జీలు, నలుగురు మహిళా జడ్జీలు ఉన్నారు. వారంతా వాదనలు విని నిందితుడిని నిర్దోషిగా పేర్కొనడంతో ఆ దేశ ప్రజలు ఒక్కింత నిరాశకు గురయ్యారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. అంతేకాదు ఒక వినూత్న పద్ధతిలో మహిళలంతా వారి అండర్ వేర్లతో నిరసన తెలుపుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు ఎనిమిది నెలల క్రితం కూడా ఐర్లాండ్లో అత్యాచార ఘటనపై ఇదే స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. రగ్బీ ప్లేయర్లు అయిన పాడీ జాక్సన్, స్టువార్ట్ ఓల్డింగ్లపై అత్యాచార ఆరోపణలు రావడంతో కోర్టు వీరిని విచారణ చేసి నిర్దోషులుగా ప్రకటించింది.