కరోనాపై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన: వైరస్కు ఆ తేడా ఉండదట: ప్రతి ఒక్కరికీ ఫ్లూ వ్యాక్సిన్
జెనీవా: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటన చేసింది. ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ను వేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. వైరస్ ఏ ఒక్కరినీ వదలకపోవచ్చని, దాని బారిన పడకుండా ఉండటానికి ఫ్లూ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదని, ఈ పరిస్థితుల మధ్య ముందుజాగ్రత్త చర్యగా ఫ్లూ వ్యాక్సినేషన్ ఒక్కటే శరణ్యమని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు స్పష్టం చేశారు.
కరోనా ప్రళయం: దేశంలో నయా రికార్డ్: ఒక్కరోజులో 70 వేలకు చేరువగా: ప్రతి నిమిషానికీ
ప్రపంచ దేశాలన్నీ ఈ ఏడాది ఫ్లూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అడ్వైజర్ బ్రూస్ ఐల్వార్డ్ చెప్పారు. దీనివల్ల కరోనా వైరస్ వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది ప్రజల్లో యాంటీ బాడీస్ ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని డబ్ల్యూహెచ్ఓ ఎమిడెమియాలజిస్ట్ మారియా వ్యాన్ కెర్ఖోవ్ చెప్పారు.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చుట్టబెట్టేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్లూ వ్యాక్సినేషన్ ఒక్కటే కొద్దో, గొప్పో ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుతుందని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దారి బారిన పడిన వారిలో శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణించడానికి అదే కారణమౌతోందని తాము అంచనా వేస్తున్నట్లు మారియా పేర్కొన్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని, దీనికోసం ఫ్లూ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు.
గర్భిణులు, వయోధిక వృద్ధులు, చిన్నపిల్లలతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఫ్లూ త్వరగా సోకుతుందని నిపుణులు హెచ్చరించారు. అస్థమా, సీఓపీడీ, ఒబేసిటీ, డయాబెటీస్, కేన్సర్, కిడ్నీ లేదా కాలేయ సంబంధిత వ్యాధులు, సిస్టక్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఫ్లూ బారిన త్వరగా పడతారని పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన తరువాత మృత్యువాత పడుతున్న వారిలో ఆయా సమస్యలతో బాధపడుతున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారని తమ అధ్యయనం తేలినట్లు స్పష్టం చేశారు.