డొక్లామ్, బ్రిక్స్ ఎఫెక్ట్: భారత్ ముందు పనిచేయని చైనా వ్యూహం
డొక్లాం విషయంలో భారత్ ముందు చైనా ప్రగల్భాలు తేలిపోయాయి. భారత్ను తక్కువగా అంచనా వేసి, చైనా బొక్కబోర్లా పడింది. ఏకంగా యుద్ధానికే సిద్ధమంటూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది.
ఢిల్లీ/బీజింగ్: డొక్లాం విషయంలో భారత్ ముందు చైనా ప్రగల్భాలు తేలిపోయాయి. భారత్ను తక్కువగా అంచనా వేసి, చైనా బొక్కబోర్లా పడింది. ఏకంగా యుద్ధానికే సిద్ధమంటూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది.
చివరకు భారత్ పాచికలకు చిత్తయింది. రెండు నెలలకు పైగా డొక్లామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులను కల్పించి, భారత్ను భయపెట్టాలని చూసింది. కానీ భారత్ వ్యూహాత్మక కదలికలు, అంతర్జాతీయంగా భారత్కు మద్దతు రావడంతో తగ్గింది.
డొక్లామ్పై మోడీ ఆదేశాలు: భారత్ నిలదీత, ఆ ప్రశ్నతో తగ్గిన చైనా!
యుద్ధానికి సైతం సిద్ధమని రోజుకో ప్రకటన చేసిన చైనా చివరకు భారత్ పెట్టిన షరతుకు (ఇరువైపుల సైన్యాలు వెళ్లిపోవడం) తలొగ్గింది. మాట్లాడకుండా డోక్లామ్ నుంచి తన దళాలను ఉపసంహరించుకుంది.
దూకుడుగా ఉంటుందని అంచనా వేయలేదు
డోక్లామ్ విషయంలో భారత్ అంత దూకుడుగా స్పందిస్తుందని చైనా అంచనా వేయలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు. చైనా తోక ముడవడానికి అదే కారణమంటున్నారు. డోక్లామ్ విషయంలో చైనా విభజించు పాలించు కుట్రలు భారత్ ముందు పనిచేయలేదని చెబుతున్నారు.
తగ్గడానికి ఈ దేశాల మద్దతు భారత్కు ఉండటం ఓ కారణం
సాధ్యమైనంత వరకు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి, చివరకు డోక్లామ్ విషయంలో మౌనం వహించిందని అంటున్నారు. దీనికి తోడు అమెరికా, బ్రిటన్, జపాన్లు ఈ విషయంలో భారత్కు బహిరంగంగానే మద్దతు పలకడం కూడా చైనా వెనక్కి తగ్గడానికి మరో కారణం. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు చర్చలు ఒకటే పరిష్కారమని ఆ దేశాలు సూచించాయి.
భారత్కు అధ్యక్షుడు సహా బెదిరింపులు
చైనా ఆర్మీ డే సందర్భంగా భారత్పై మిలటరీ యాక్షన్ తప్పదని అధ్యక్షుడు జి జిన్పింగ్ హెచ్చరించారు. భారత్ తన దూకుడును తగ్గించుకుని డోక్లామ్ నుంచి ఎటువంటి షరతులు లేకుండా వెనక్కి వెళ్లాల్సిందేనని చైనా అధికార ప్రతినిధి కూడా డిమాండ్ చేశారు.
ప్లేటు మార్చిన చైనా మీడియా
అప్పటి భారత్పై చైనా మీడియా బాగా విరుచుకుపడింది. 1962 పునరావృతమవుతుందని హెచ్చరించింది. అయితే భారత్ కూడా అదే స్థాయిలో హెచ్చరించింది. ఇది అప్పటి భారత్ కాదని, 2017 భారత్ అని తీవ్రస్థాయిలో హెచ్చరికలు పంపింది. దీంతో చైనాకు భవిష్యత్తు కళ్లముందు కనిపించింది. మీడియా తన స్వరాన్ని మార్చేసింది. ఇప్పుడు డోక్లామ్ విషయంలో చైనానే బాధితురాలంటూ సన్నాయినొక్కులు నొక్కింది.
బ్రిక్స్ దెబ్బ.. చైనా అబ్బా
భారత్ దూకుడుగా వ్యవహరిస్తోందని, జగడాలమారి అని ప్రచారం మొదలుపెట్టే ప్రయత్నం చేసింది. మరోవైపు డోక్లామ్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు అమెరికా, జపాన్కు కలిసి వచ్చింది. దక్షిణ చైనా సముద్ర వివాదం విషయంలో చైనా మెడలు వంచేందుకు ఇది వాటికి బాగా ఉపయోగపడింది. దీంతో స్వరం తగ్గించిన చైనా ఇప్పుడు బ్రిక్స్ దేశాలు మరింత బలపడడానికి భారత్ సహకారం ఎంతో అవసరమని చెప్పింది. భారత్ సానుకూల వైఖరి పైనే బ్రిక్స్ విజయం ఆధారపడి ఉందని పేర్కొంది.
ఈ కారణాలు కూడా
డోక్లామ్ విషయంలో బీరాలు పలికిన చైనా ఒక్కసారిగా వెనక్కి తగ్గడానికి చైనా ఉత్పత్తులు మరో బలమైన కారణం. ఆగస్టులో చైనాకు చెందిన 90కి పైగా ఉత్పత్తులపై భారత్ దిగుమతి నిరోధక సుంకం విధించడంతో విలవిల్లాడింది. దీనికి తోడు భారత్ - అమెరికా బంధం బలపడుతుండడం కూడా బీజింగ్కు కంటిమీద కునుకులేకుండా చేసింది. భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత చైనాను వ్యతిరేకించడం మరింత ఎక్కువైందని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఆందోళన వ్యక్తం చేసింది.