చైనీయుల ఆహారపు అలవాట్ల వెనుకున్న అసలు కారణమిదే.. చరిత్ర ఏం చెబుతోంది..
ప్రపంచాన్ని కరోనా భయం వెంటాడుతోంది. కరోనా ప్రభావం ఆర్థిక రంగాలపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో ఈ వైరస్ ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించింది. ప్రాణ నష్టంతో పాటు ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను వైరస్ కబళిస్తోంది. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం.. క్లినికల్ ట్రయల్స్ ఎంతమేర విజయవంతమవుతాయో తెలియకపోవడంతో వైరస్ వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట వేయడం సాధ్యపడట్లేదు. మరోవైపు వైరస్ మూలాలపై కూడా ఇప్పటివరకు శాస్త్రీయపరమైన ఆధారాలేవి వెల్లడికాలేదు. చైనాలోని వుహాన్ నగరం నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చినట్టు చెబుతున్నప్పటికీ.. ఎలా అది బయటకొచ్చిందన్నది అంతుచిక్కడం లేదు.
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి.. చైనా వాళ్ల ఆహారపు అలవాట్లే కరోనా వైరస్కు కారణమయ్యాయన్న విమర్శ. చైనీయులు ఏ జీవిని వదలకుండా తినడం వల్లే ప్రపంచానికి కరోనా ముప్పు వచ్చిందని చాలామంది సోషల్ మీడియాలోనూ,బయట అభిప్రాయపడుతున్నారు. వైరస్ వ్యాప్తికి ఆహారపు అలవాట్లే కారణమని ఇప్పటికైతే ఏ పరిశోధనలోనూ వెల్లడి కాలేదు. అయితే చైనీయుల ఆహారపు అలవాట్లపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైనీయుల ఈ ఆహారపు అలవాట్ల వెనుక అసలైన కారణమేంటో తెలుసా..
చైనా ఆహారపు అలవాట్లు.. ఎలా పుట్టుకొచ్చాయి..
చైనాలో వన్యప్రాణుల వినియోగం ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం.. ఆనాటి కమ్యూనిస్టు యోధుడు మావో జెడాంగ్ అన్న వాదన ప్రచారంలో ఉంది. చైనా సామాజిక,ఆర్థిక స్థితి గతులను మార్చివేసేందుకు ఆయన అవలంభించిన 'గ్రేట్ లీప్ ఫార్వర్డ్' విధానమే దేశంలో ఈరకమైన ఆహారపు అలవాట్లకు కారణమైందని చెబుతారు. దేశాన్ని వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక దేశంగా మార్చడం దీని ముఖ్య లక్ష్యం. అయితే, ఆ క్రమంలో 1958 నుంచి 1962 మధ్య మావో జెడాంగ్ అవలంభించిన కఠినమైన విధానాలు,సోషల్ క్యాంపెయిన్ వంటివి దేశాన్ని తీవ్ర సమస్యల్లోకి నెట్టాయని చెబుతారు. అందులో ప్రధానమైన సమస్య ఆకలి. ఆ నాలుగేళ్లలో దాదాపు 18 మిలియన్ల నుంచి 45 మిలియన్ల మంది ఆకలి,వ్యాధులు,హింస కారణంగా మృత్యువాతపడ్డారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
తీవ్ర ఆహార కొరత కారణంగా
ఆ నాలుగేళ్లలో చైనాను ఆహార కొరత తీవ్రంగా కుదిపేసింది. చైనాలోని హౌస్టన్-డౌన్టౌన్కి చెందిన పీటర్ జే లీ అనే పరిశోధకుడి ప్రకారం.. చైనా నాయకత్వ విధానాల వల్ల దేశంలో ఆహార కొరతను కొనితెచ్చుకున్నట్టయింది. పారిశ్రామికీకరణలో భాగంగా జనాభాలో ఎక్కువమందిని వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు మళ్లించడంతో జనాభాకు తగినంత తిండి దొరకని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఆఫీసర్లు,సైనికులు,సాధారణ పౌరులు.. ఇలా ప్రతీ ఒక్కరూ తిండి కోసం వేట మొదలుపెట్టారు. అలా వేట కారణంగా ఒక్క 1960 సంవత్సరంలోనే సిచుయాన్ ప్రావిన్స్లో 62వేల జింకలు మాయమయ్యాయి.
మొదట్లో దక్షిణ చైనాకే పరిమితం..
నిజానికి చైనాలో వన్యప్రాణులను తినడమనేది మొదట దక్షిణ చైనాకే పరిమితమైంది. కానీ ఆ తర్వాతి కాలంలో అది చైనా అంతటా విస్తరించింది. అదే సమయంలో చైనా జనాభా కూడా పెరిగిపోవడంతో.. వన్యప్రాణి మాంసానికి తీవ్ర స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. దీంతో చైనాలో వన్యప్రాణుల పెంపకం పెద్ద ఎత్తున సాగింది. ప్రపంచంలోనే అతి ఎక్కువ వన్యప్రాణి మాంసాన్ని తినే దేశంగా చైనా అవతరించింది. అలా వన్యప్రాణుల పెంపకం మరియు వాణిజ్యం గుత్తాధిపత్యంగా మారిపోయింది. 1988 లో చైనా వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని రూపొందించినప్పటికీ.. దాని అమలు మాత్రం అంతంతమాత్రంగానే సాగుతూ వచ్చింది.
Recommended Video
చైనాలో వన్యప్రాణి ట్రేడింగ్ గురించి..
చైనా ఆహార సంస్కృతిలో వన్యప్రాణులు కూడా ఒక భాగంగా మారిపోయాయి. దానికి తోడు ప్రతీ వన్య ప్రాణి మాంసంలో ఏదో ఒక ఔషధ గుణం ఉంటుందని చైనీయులు నమ్ముతుంటారు. అలా దాదాపుగా ప్రతీ కుటుంబం వన్యప్రాణి మాంసాన్ని తినడం అక్కడ అలవాటుగా మారిపోయింది. చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఆ దేశంలో వన్యప్రాణి ట్రేడింగ్ విలువ 74బిలియన్ డాలర్లు. ఇందులో 14మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్డిపి) ప్రకారం.. ప్రపంచంలోని 17 మెగా-జీవ వైవిధ్య దేశాల్లో చైనా ఒకటి. ప్రపంచంలోని అన్ని మొక్కల జాతులలో దాదాపు 10% మొక్కలు, భూమిపై ఉన్న మొత్తం జంతువుల్లో 14% జంతువులను కలిగి ఉంది. ప్రపంచ భూభాగంలో 6.5% ఉన్న ఈ దేశం ప్రపంచంలోని 14% సకశేరుకాలు, 20% చేప జాతులు, 13.7% పక్షులు, 711 క్షీరదాలు, 210 ఉభయచర జాతులకు నిలయంగా ఉంది.