కిడ్నీలపై కరోనావైరస్ ప్రభావం చూపుతుందా..? డాక్టర్లు ఏం చెబుతున్నారు..?
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామందిలా చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలు ఆరోగ్య సమస్యలపైనే ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ మెదడుపై ప్రభావం చూపించగలదనే విషయాన్ని కొన్ని జర్నల్స్లో రావడం చూశాం. తాజాగా ఈ మహమ్మారి మనిషి కిడ్నీపై కూడా ప్రభావం చూపుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఓ సారి చూద్దాం.
ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది కోవిడ్-19 పేషెంట్లు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముందునుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు కరోనావైరస్ బారిన పడితే వారు బతికేందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. చికిత్స మరింత కష్టతరం కావడంతో వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కరోనాపేషెంట్కు రక్తం మార్చే సమయంలో వైరస్ ఏమేరకు ప్రభావం చూపిస్తుందనేదానిపై స్పష్టత లేకున్నప్పటికీ అది కిడ్నీలపై మాత్రం ఇంపాక్ట్ చూపిస్తుందనేది వాస్తవమని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు రెండు థియరీలు కూడా ఉన్నాయి.
ఇందులో ఒకటి కరోనావైరస్ నేరుగా మూత్రపిండాలపై దాడి చేస్తుంది అని చెప్పడం జరిగింది. మార్చిలో జర్నల్ సెల్ అనే పుస్తకంలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కరోనావైరస్ ACE2 అని పిలువబడే కణాలపై ఒక రకమైన గ్రాహకంతో (రిసెప్టర్స్) బంధించడం ద్వారా శరీరంలోకి చొరబడుతుంది. ఈ ప్రత్యేక గ్రాహకాలు గుండె మరియు ఊపిరితిత్తులలోని కణాలలో మాత్రమే కాకుండా, మూత్రపిండాలలో కూడా కనిపిస్తాయని పేర్కొనడం జరిగింది.
Recommended Video
కరోనావైరస్ మూత్రపిండాల పై ప్రభావం చూపిస్తుందని శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా జరగకుండా ఈ వైరస్ అడ్డుకుంటుందని డాక్టర్ హోలీ క్రామర్ చెప్పారు. కోవిడ్-19 ఊపిరితిత్తులపై దాడి తీవ్రంగా చేస్తుందని ఈ సమయంలో మనిషికి కావాల్సినంత ఆక్సిజన్ సరఫరా జరగదని వెల్లడించారు. రక్తంపై వైరస్ చూపుతున్న ప్రభావంతోనే ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయని వారు చెబుతున్నారు