లండన్ వెళ్లి నాబిడ్డతో ఉండాలనుంది: సిరియాలోని మహిళా ఉగ్రవాది
2015లో లండన్ నుంచి పారిపోయి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరిన బంగ్లాదేశీ యువతి తిరిగి బ్రిటన్కు చేరుకోవాలని భావిస్తోంది. ఐసిస్లో ఉండగా అక్కడి ఉగ్రవాదులను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. తన కడుపులో బిడ్డ కంటే తనకేది ముఖ్యం కాదని చెబుతూ వెంటనే తిరిగి లండన్కు వెళ్లాలని భావిస్తోంది.
షమీమా బేగం అనే యువతి 2015లో బ్రిటన్లోని ఓ స్కూలు నుంచి పారిపోయి వచ్చింది. ఈమెతో పాటు మరో ముగ్గురు కూడా పారిపోయి వచ్చారు. ఆ సమయంలో వారు ఐసిస్ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్నారు. సిరియాలోని ఓ చోటు నుంచి మాట్లాడిన బేగం తను ఇంతకుముందు ఇద్దరి పిల్లలను పోగొట్టుకున్నట్లు వెల్లడించింది.ఇప్పుడు తాను 9నెలల నిండు గర్భిణిని అని చెబుతూ వెంటనే లండన్కు తిరిగి వచ్చేయాలని ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం తాను జీహాదీల నుంచి తప్పించుకు వచ్చినట్లు చెప్పిన బేగం... సిరియాలోని పునరావాస కేంద్రంలో ఉన్నట్లు చెప్పింది. తన కడుపులోని బిడ్డ ఆరోగ్యం దెబ్బతినకముందే తను లండన్ చేరుకునేలా సహాయం చేయండంటూ ఆమె అర్థిస్తోంది. ఇక ఇప్పటి నుంచి ఏ క్షణమైనా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని ఆమె వెల్లడించింది.ఒకవేళ ఇంటికి చేరుకోగలిగితే తాను తన బిడ్డతో సంతోషంగా గడుపుతానని పేర్కొంది.
2015 ఫిబ్రవరిలో షమీమా బేగంతో పాటు బెతనల్ గ్రీన్ అకాడెమీ స్కూలు నుంచి మరో ఇద్దరు విద్యార్థులు కటిజా సుల్తానా, అమిరా అబేస్లు గట్విక్ నుంచి టర్కీకి పారిపోయారు. అక్కడి నుంచి సిరియాకు పారిపోయారు.ఇక ఓ దాడిలో సుల్తానా మృతి చెందినట్లు ఆమె తెలిపింది. తొలుత తను ఇంగ్లీషు మాట్లాడే వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావించింది కాని...27 ఏళ్ల డచ్ వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇతను కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు వెల్లడించింది షమీమా.
ఇక అప్పటి నుంచి ఇద్దరూ కలిసే ఉన్నారు. గతవారమే బాగుజ్ నుంచి ఇద్దరు తప్పించుకున్నారు.ఐసిస్లో ఫైటర్గా ఉన్న తన భర్త అమెరికా మద్దతు ఇస్తున్న సిరియన్ డెమొక్రటిక్ బలగాలకు లొంగిపోయాడని...ఇక అప్పటి నుంచి తన భర్తను చూడలేదని పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదులు ఆగడాలు మితిమీరిపోయాయని మానవత్వం అనేది లేకుండా పోయిందని చెప్పిన షమీమా వారు భూమిపై ఉండేందుకు అర్హులు కారని చెప్పింది.
ముందుగా బ్రిటీషు ప్రభుత్వం తిరిగి తమ దేశానికి రావొద్దని చెప్పింది. తర్వాత ఒక్క అవకాశం ఇస్తే అన్నీ మానేసి తన బిడ్డతో కలిసి బతుకుతానని చెప్పింది షమీమా. దీంతో ఆలోచిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.