సారీ, భారత్ సహా ఇక ఏ దేశంలోనూ తప్పు జరగదు: జుకర్బర్గ్
Recommended Video
వాషింగ్టన్: మరోసారి తమ వల్ల తప్పు జరగదని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్పష్టం చేశారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మరోసారి అమెరికా కాంగ్రెస్ ముందు హాజరయ్యారు. ఫేస్బుక్లో జరిగిన డేటా దుర్వినియోగానికి తానే బాధ్యత వహిస్తూ మరోసారి సెనేట్లో క్షమాపణలు కోరారు.
సెనేట్కు చెందిన జ్యుడీషియరీ, కామర్స్ కమిటీల ఎదుట జుకర్బర్గ్ మాట్లాడారు. తప్పు తనదేనని మరోసారి అంగీకరించారు. 'ఫేస్బుక్ నేనే ప్రారంభించాను, నేనే నిర్వహిస్తున్నా, ఇక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత' అని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.
భారత్ సహా మరే దేశంలోనూ..
భారత్ సహా పలు దేశాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో డేటా లీకేజీ జరగకుండా ఉండేందుకు తమ కంపెనీ అన్ని విధాలా కృషి చేస్తుందని హామీ మార్క్ జుకర్బర్గ్ ఇచ్చారు. ‘2018 సంవత్సరం ప్రపంచమంతటికీ చాలా కీలకమైన సంవత్సరం. భారత్, పాకిస్థాన్, బ్రెజిల్ సహా పలు దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సమాచారం సురక్షితంగా ఉండేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం' అని ఆయన తెలిపారు.
భారత ఎన్నికల ప్రాధాన్యత తెలుసు
రాబోయే ఎన్నికల్లో ఎవ్వరి జోక్యం ఉండకుండా చేయడమే తమ ముందున్న ముఖ్యమైన అంశమని జుకర్బర్గ్ పేర్కొన్నారు. నవంబరులో అమెరికాలో జరిగే కాంగ్రెషనల్ మధ్యంతర ఎన్నికలకు కూడా పూర్తి రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. భారత్ చాలా పెద్ద దేశమని, అక్కడి ఎన్నికల ప్రాధాన్యత తనకు తెలుసని వ్యాఖ్యానించారు. భారత్పై తన వద్ద ఓ డాక్యుమెంటేషన్ కూడా ఉందని, ఆసక్తి ఉంటే చూపిస్తానని జుకర్బర్గ్ సెనెటర్లకు వెల్లడించారు.
డేటా దుర్వినియోగంపై సెనెటర్ల ఆగ్రహం
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున పనిచేసిన బ్రిటన్కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 8.7కోట్ల మంది వినియోగదారుల సమాచారం అక్రమంగా ఉపయోగించుకోగా, అందులో 5.62లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఫేస్బుక్పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. వినియోగదారుల సమాచార ప్రైవసీ, భద్రతపై విఫలమవ్వడంపై అమెరికా సెనెటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తప్పు జరగకుండా చర్యలు
డేటా లీకేజీకి సంబంధించి జుకర్బర్గ్పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో జుకర్బర్గ్ పలుమార్లు క్షమాపణలు చెప్పారు. తప్పుడు వార్తలకు సమాచారం వాడకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యామని, యాప్ డెవలపర్ నుంచి కేంబ్రిడ్జి అనలిటికా సమాచారం పొందిందని తెలిపారు. రష్యాలో కొందరు పని గట్టుకుని తమ వ్యవస్థను, ఇతర ఇంటర్నెట్ వ్యవస్థలను దెబ్బ తీసే పనిలో ఉన్నారని జుకర్బర్గ్ ఆరోపించారు. డేటా దుర్వినియోగంపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వేల సంఖ్యలో నకిలీ ఖాతాలు తొలగించామని వివరించారు. ఇది ఇలా ఉండగా, కేంబ్రిడ్జ్ అనలిటికా లీకేజీపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.