చెంపలేసుకున్న శ్రీలంక - చైనాతో ఒప్పందం భారీ తప్పిదం - ఇకపై ‘ఇండియా ఫస్ట్’ పాలసీ -నమ్మొచ్చా?
భౌగోళికంగా భారత్ కు దగ్గరగా ఉండే శ్రీలంక.. చైనాతో దోస్తీ తర్వాత క్రమంగా దూరమవుతూ వచ్చింది. కమ్యూనిస్టు దేశంతో సైనిక, ఆర్థిక రంగాల్లో భారీ ఒప్పందాలు చేసుకుంది. కానీ తాను డ్రాగన్ కబందహస్తాల్లో చిక్కుకుపోయానని ద్వీపదేశం ఆలస్యంగా గుర్తించింది. చేసిన తప్పుకు ఇప్పుడు చెంపలేసుకుంటోంది. ఇకపై ఇండియాకే మొదటి ప్రాధాన్యం ఇస్తానని అంటోంది.
షాకింగ్: చైనా యుద్ధ విన్యాసాలు రద్దు - పైనుంచి యూఎస్-2 రాకతో కలకలం- ఉల్లంఘనపై డ్రాగన్ ఫైర్
ఇండియా ఫస్ట్ పాలసీ
అధ్యక్షుడు గోటాబయా రాజపక్స ఆదేశాల మేరకు శ్రీలంక తన విదేశాంగ విధానాన్ని మార్చుకోబోతున్నదని, ఇకపై వ్యూహాత్మక, రక్షణ వ్యవహారాల్లో ‘ఇండియా ఫస్ట్' పాలసీని అనుసరిస్తామని శ్రీలంక విదేశాంగా శాఖ కార్యదర్శి జయనాథ్ కొలంబగే తెలిపారు. ఇటీవల కాలంలో ఇండియాతో సంబంధాలు కొంత ప్రభావితం అయినప్పటికీ, సహజ మిత్రులుగా తిరిగి ఒక్కటిగా పయనించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. చైనాతో శ్రీలంక ఒప్పందాలు భారీ తప్పిదమనీ ఆయన అంగీకరించారు.
ఇండియాకు ముప్పుగా మారొద్దు..
‘‘ఇండియాకు ముప్పు తలపెట్టే దేశంగా ఉండటం శ్రీలంక భరించలేదు. అయినా పొరుగుదేశానికి హానికారకంగా ఉండాల్సిన అవసరం మనకు లేదు. ఇండియా నుంచి వీలైనంతమేరలో లబ్ది పొందాలే తప్ప చికాకు పెట్టొద్దు. రక్షణ, భద్రతాపరమైన అంశాల్లో మన మొదటి ప్రాధాన్యం భారద్ కే ఇద్దామని అధ్యక్షుడు రాజపక్స మాకు స్పష్టం చేశారు'' అని కార్యదర్శి జయనాథ్ వివరించారు. ఓ టీవీ చానెల్ లో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు. అలాగే..
ఆ ఒప్పందం తప్పిదం..
శ్రీలంకలో నైరుతి ప్రాంతంలోని హంబన్ తోటా పోర్టును 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకు ఇవ్వడం తాము చేసిన భారీ తప్పిదని జయనాథ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడా పోర్టుపై చైనాకు 85 శాతం ఆదిపత్యం ఉందని, శ్రీలంకకు 15 శాతం మాత్రమే వాటా దక్కిందని వాపోయారు. అయితే, ఆర్థిక మనుగడ కోసం ఇతర దేశాలతో ఏదో ఒక విధంగా వ్యవహరించక తప్పడంలేదని, రాబోయే రోజుల్లో మాత్రం రక్షణ వ్యవహారాల్లో ఇండియాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు.
హంబన్ తోటా ముప్పు
2010లో నిర్మించిన హంబన్ తోటా ఓడరేవుకు సైనిక పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. చైనా యుద్ధనౌకలు హిందూ మహాసముద్రంలో సంచరించటానికి ఇంధనం నింపుకోవటానికి అనువైన ప్రాంతంలో ఉందీ రేవు. 99ఏళ్ల పాటు ఆ పోర్టును చైనా లీజుకు తీసుకోవడం భద్రత పరంగా భారత్ కు సవాలు విసిరనట్లయింది. కాగా, నాడు ఆ పోర్టును చైనాకు రాసిచ్చిన రాజపక్స కుటుంబం ఇప్పుడా ఒప్పందాన్ని తప్పిదమని, ఇండియా ఫస్ట్ విధానాన్ని అవలంభిస్తామని చెప్పడం అనూహ్య పరిణామంగా మారింది. ఎందుకంటే..
రాజపక్సను నమ్మొచ్చా?
ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు గోటాబయా రాజపక్స.. ఆదేశ ప్రధాని మహీంద రాజపక్సకు సోదరుడే. వాళ్లిద్దరి సారధ్యంలోని ‘‘శ్రీలంక పోదుజన పెరామునా'' పార్టీ తొలి నుంచీ భారత్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించేదే. మహీంద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే హంబన్ తోటా పోర్టును చైనాకు కట్టబెట్టారు. ఇప్పుడాయన ప్రధాని పదవిలో ఉండగా, సోదరుడు గొటాబయా అధ్యక్షుడయ్యారు. ఇండియాతో దోస్తీ విషయంలో శ్రీలంక చేసిన తాజా ప్రకటనలపై మోదీ సర్కార్ స్పందించాల్సిఉంది.
Recommended Video
షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై ఘాతుకం - సెటిల్మెంట్ - కులం తక్కువని రివర్స్