భారత్-అమెరికా మధ్య గూగుల్ ట్యాక్స్ చిచ్చు- పెరుగుతున్న గ్యాప్ - ఇక శుభం కార్డేనా ?
ఒకప్పుడు సోవియట్ యూనియన్, ఆ తర్వాత రష్యాతో ఉన్న నమ్మకమైన బంధాన్ని వదులుకుని అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు వంతపాడిన భారత్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోంది. భౌగోళిక రాజకీయాల పరంగా భారత్ ను కీలక దేశంగా భావిస్తున్నప్పటికీ వాణిజ్య పరమైన అంశాల్లో మాత్రం అమెరికా మిత్రుడిగా భావించడం లేదు. తాజాగా చైనాతో నెలకొన్న ఘర్షణల విషయంలో భారత్ కు అమెరికా ఎంతోకాలం అండగా నిలిచే అవకాశం లేదనే వాదన వినిపిస్తుండగా.. తాజాగా మరో దేశం ఇరుదేశాల మధ్య సంబంధాల్లో గ్యాప్ పెంచేలా కనిపిస్తోంది.
మాస్క్తో ట్రంప్: ఫస్ట్ టైమ్: బెదురుతోన్న అమెరికా..అతలాకుతలం: ఒక్కరోజే 66 వేలకు పైగా
కరోనా తర్వాత భారత్ -అమెరికా సంబంధాలు...
అమెరికాలో ట్రంప్ సర్కారు ఏర్పడిన తర్వాత భారత్ తో వ్యూహత్మక సంబంధాలకే ప్రాధాన్యం ఇస్తున్న అక్కడి ప్రభుత్వం... వాణిజ్య పరమైన అంశాల్లో తన ప్రయోజనాల విషయానికొచ్చేసరికి సున్నితంగానే భారత్ కు చురకలు అంటిస్తోంది. అమెరికాలో భారత విద్యార్ధుల చదువులు, ఉద్యోగాలు, వీసాల విషయంలో ఇప్పటికే పలు కత్తిరింపులకు దిగిన అధ్యక్షుడు ట్రంప్... తాజాగా కరోనా తర్వాత కూడా తన జోరు కొనసాగిస్తున్నారు. ఓవైపు చైనాకు వ్యతిరేకంగా భారత్ కు మద్దతిస్తున్నట్లు నటిస్తూనే చైనాతో బిగ్ డీల్ కు ట్రంప్ సిద్దమవుతున్నారని తాజాగా ఆయన హయాంలో భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ కుండబద్దలు కొట్టారు. దీంతో భారత్ పై అమెరికా కపట ప్రేమ బయటపడింది.
భారత్ గూగుల్ ట్యాక్స్...
కరోనా సంక్షోభం కంటే ముందే భారత్ లో డిజిటల్ వ్యాపారాలు చేసుకుంటున్న అమెరికన్ దిగ్గజాలు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సంస్ధల ఆదాయంపై భారత్ 6 శాతం గూగుల్ ట్యాక్స్ విధించింది. దీన్నే డిజిటల్ ట్యాక్స్, ఈక్వలైజేషన్ ట్యాక్స్ గా కూడా పిలుస్తున్నారు. 2016-17 నుంచే భారత్ దీన్ని అమలు చేస్తోంది. భారత్ లో వాణిజ్య ప్రకటనల ద్వారా భారీ ఆదాయాన్ని అర్జిస్తున్న ఈ సంస్దలు తమ ఆదాయాన్ని తక్కువగా చూపుతూ కేంద్రానికి పన్నులు ఎగ్గొడుతున్నాయి. మన దేశంలో డిజిటల్ చట్టాలు కఠినంగా లేకపోవడం కూడా ఇందుకు కారణమే. అయితే ప్రభుత్వం విదేశీ డిజిటల్ సంస్ధల వ్యవహారాన్ని చూశాక వీరికి భారత్ లో పొందే ఆదాయంపై ఫ్లాట్ రేటు 2 శాతం ట్యాక్స్ గా నిర్ణయించింది. అంతే గాకుండా ఈ కంపెనీల నుంచి పన్ను వసూలు కోసం మరో ప్రత్యేక సంస్ధనూ ఏర్పాటు చేసింది.
భారత్ పై ట్రంప్ గుర్రు...
అమెరికన్ డిజిటల్ కంపెనీలపై ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలు ఈ ట్యాక్స్ విధిస్తుండగా.. ఇందులో భారత్ కూడా ఒకటి. ఆయా దేశాల నుంచి పన్నుల కోసం పెరుగుతున్న ఒత్తిడితో గూగుల్ తో పాటు మిగిలిన సంస్ధలు కూడా అధ్యక్షుడు ట్రంప్ ను ఆశ్రయించాయి. దీంతో ఈ వ్యవహారమేంటో తేల్చాలని అమెరికా ప్రభుత్వ విభాగ ప్రతినిధి యూఎస్టీఆర్ ను ఆదేశించారు. దీంతో ఓ నివేదిక రూపొందించి అమెరికా సంస్ధలపై ఒత్తిడి పెంచుతున్న దేశాల జాబితా సిద్ధం చేశారు. ఇందులో భారత్, ఫ్రాన్స్ తో పాటు మరికొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. ఈ నివేదిక రాగానే ట్రంప్ సర్కారు ముందుగా తమ సంస్ధలపై డిజిటల్ పన్ను విధిస్తున్న ఫ్రాన్స్ నుంచి దిగుమతులపై 25 శాతం అదనపు డ్యూటీలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో భారత్ పైనా ఇదే తరహా ఆంక్షలకు సిద్ధమవుతున్నారు.
భారత్ వాదన ఇదీ..
మన దేశంలో వ్యాపారాలు చేసుకుంటూ ప్రభుత్వానికి పన్ను కట్టమంటే ఆంక్షలతో బెదిరించడమేంటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై భారత్ గుర్రుగా ఉంది. గూగుల్ ట్యాక్స్ పరిధి విస్తృతంగా ఉన్నప్పటికీ అమెరికన్ దిగ్గజాలు కడుతున్న పన్నులు మాత్రం అత్యల్ప స్ధాయిలో ఉంటున్నాయని, వీటిని కూడా కట్టరా అంటూ భారత్ ప్రశ్నిస్తోంది. అయితే ఇప్పటికే అమెరికాతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో డిజిటల్ ట్యాక్స్ కోసం పట్టుబడితే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్ కు చెందిన దాదాపు ఆరు బిలియన్ డాలర్ల వస్తువులను అమెరికా జీఎన్పీ నుంచి తొలగించింది. ఆ తర్వాత భారత్ కూడా అమెరికా వస్తువుల దిగుమతులపై పన్నులు పెంచింది. ఇలాంటి తరుణంలో గూగుల్ ట్యాక్స్ ఇరుదేశాల మధ్య మరో చిచ్చు పెట్టనుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.