విక్రమ్ ల్యాండర్ పై నాసా అప్ డేట్: సూర్యాస్తమయంలో తీసిన ఫొటోల వల్లే: మరోసారి ప్రయత్నం
న్యూయార్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా మరోసారి ప్రయత్నాలు ఆరంభించింది. త్వరలో లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) ద్వారా మరోసారి విక్రమ్ల్ ల్యాండర్ కోసం అన్వేషణ చేపట్టబోతోంది. ఈ సారి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదని ధృడ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నాసా శాస్త్రవేత్త వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధృవం వైపున విక్రమ్ ల్యాండర్ దిగినట్టుగా భావిస్తోన్న ప్రదేశంపై నుంచి లూనార్ ఆర్బిటర్ ను ప్రయాణించేలా చేస్తామని, ఇదివరకటి కంటే శక్తిమంతమైన కెమెరాల ద్వారా ఫొటోలను తీస్తామని చెప్పారు.
చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ ను ప్రయోగించిన విషయం తెలిసిందే. జాబిల్లి దక్షిణ ధృవం వైపు ల్యాండ్ అయ్యేలా దీన్ని చందమామ మీదికి పంపించారు. కిందటి నెల 7వ తేదీన చంద్రుడి ఉపరితలం మీద దిగే సమయంలో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గల్లంతైంది. ఉపరితలం మీది నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు అందుతున్న సంకేతాలు స్తంభించిపోయాయి. అనంతరం దాని జాడ తెలియరాలేదు. చంద్రుడి ఉపరితలంపై నిర్దేశిత ప్రదేశంలోనే విక్రమ్ ల్యాండర్ దిగినట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్ ప్రకటించారు. దానితో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
కొన్ని రోజుల తరబడి ఇస్రో ల్యాండర్ తో అనుసంధానం కావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో నాసా కూడా రంగ ప్రవేశం చేసింది. ఇస్రో కంటే శక్తిమంతమైన రేడియో ధార్మిక సంకేతాలను చంద్రుడి మీదికి పంపించింది. అయినప్పటికీ.. విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి అనుకూల సమాచారం గానీ, సంకేతాలు గానీ రాలేదు. దీనితో ఆశలు వదులుకున్నారు. అయినప్పటికీ.. నాసా పట్టువదల్లేదు. లూనార్ ఆర్బిటర్ ను దక్షిణ ధృవం వైపు ప్రయాణించేలా చేసింది. ఈ సందర్భంగా ఆర్బిటర్ ద్వారా ల్యాండర్ దిగిన ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను తీసింది. ఈ ఫొటోలను క్షుణ్నంగా విశ్లేషించారు నాసా శాస్త్రవేత్తలు. అయినా ల్యాండర్ జాడ కానరాలేదు.
మలి ప్రయత్నంలో భాగంగా మరోసారి లూనార్ ఆర్బిటర్ ను దక్షిణ ధృవం వైపు పంపించడానికి సిద్ధమయ్యారు. ఈ సారి మరింత శక్తిమంతమైన కెమెరాల ద్వారా హై రిజల్యూషన్ ఫొటోలను తీస్తామని నాసా శాస్త్రవేత్త వెల్లడించారు. మరో రెండు రోజుల్లో తమ ఆర్బిటర్ నుచ దక్షిణ ధృవం వైపు ప్రయాణించేలా చేస్తామని అన్నారు. ఇదివరకు విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని ఫొటోలు తీసిన సమయంలో సూర్యాస్తమయంలో ఫొటోలను తీశామని, అందుకే విఫలం అయ్యామని వివరించారు. సూర్యాస్తమయంలో ఎత్తయిన గుట్టల నీడ ల్యాండర్ దిగిన ప్రదేశంపై ఆవరించుకుందని, ఫలితంగా అది కెమెరా కంటికి దొరకలేదని విశ్లేషించారు.