క్రికెట్లో తప్ప.. మిగితా అన్నింటిలో భారత్ వైపే: మాలాలా
ఓస్లో: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే తన మద్దతు ఖచ్ఛితంగా తన దేశానికే అని చెప్పారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్. ఒక్క క్రికెట్లో తప్ప మిగతా అన్ని అంశాల్లో తాను భారత్వైపేనని అన్నారు.
‘ఒక్క క్రికెట్ మ్యాచులో మాత్రమే నేను పాకిస్థాన్కు మద్దతు ఇస్తా. మిగితా అన్ని విషయాల్లోనూ నేను భారతదేశం వైపే' అని మలాలా యూసఫ్జాయ్ స్పష్టం చేశారు.
తాలిబాన్ల దాడి నుంచి మృత్యుంజయురాలుగా బయటపడి బాలికల విద్య కోసం పోరాడుతున్న 17 ఏండ్ల పాక్ బాలిక మలాలా.. భారత్కు చెందిన కైలాశ్ సత్యార్థితో కలిసి బుధవారమిక్కడ నోబెల్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
మలాలా, సత్యార్థిలకు అమెరికా సెనేట్ అభినందన
వాషింగ్టన్: నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న మన దేశానికి చెందిన కైలాష్ సత్యార్థి, పాకిస్థాన్కు చెందిన మలాలా యూసఫ్జాయ్లకు అమెరికా సెనెట్ అభినందనలు తెలిపింది. బాలల హక్కుల పరిరక్షణకు, చదువుకోవడానికి వారికున్న హక్కుల పరిరక్షణ కోసం సత్యార్థి, మలాలా చేసిన సేవలను గుర్తిస్తూ అమెరికా సెనేట్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
సత్యార్థి స్వయంగా దాదాపు 84 వేల మంది చిన్నారులకు వెట్టిచాకిరీనుంచి విముక్తి కల్పించారని, మలాలా 11 ఏళ్ల వయసు నుంచే పాకిస్థాన్లో బాలికల విద్యాభ్యాసం కోసం కృషి చేస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలకు చదువుకొనే అవకాశాల కోసం నిరంతర పోరాటం సాగిస్తున్నారని సెనేటర్ టామ్ హాకిన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
బాలల కట్టుబానిసత్వాన్ని అంతమొందించడానికి, బాలలందరికీ విద్యావకాశాలు కల్పించడానికి పోరాటం సాగిస్తున్న వారికి సత్యార్థి, మలాలాలు ఆదర్శమని తీర్మానం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇందుకోసం వ్యక్తులు సాగిస్తున్న కృషిని తీర్మానం ప్రశంసిస్తూ, ఈ విషయంలో ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయని వెల్లడించింది. సెనేట్ ఆమోదించిన తర్వాత ఈ తీర్మానాన్ని అవసరమైన చర్యలకోసం సెనేట్కు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీకి పంపిస్తారు.