ఉగ్రదాడులపై అవసరమైతే ఆదేశ సహకారం కోరుతాం: రణిల్ విక్రమసింఘే
శ్రీలంక ఉగ్రదాడులకు సంబంధించి అవసరమైతే పాకిస్తాన్ సహకారం కూడా కోరుతామని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. ఓ జాతీయ పత్రిక ఈమెయిల్ ద్వారా కొన్ని ప్రశ్నలు రణిల్ విక్రమసింఘేకు పంపింది. వీటికి ఆయన జవాబు ఇచ్చారు.
దాడులకు వారం ముందు ఎన్ఐఏ సమాచారం ఇచ్చింది
గతేడాది కొలంబోలో నివాసముంటున్న పాకిస్తాన్ అధికారి భారత్లోని అమెరికా ఇజ్రాయిల్ కాన్సులేట్ల పై దాడులకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏకు సమాచారం అందింది. ఇదే సమాచారాన్ని ఒక హెచ్చరికగా పలు సందర్భాల్లో శ్రీలంకకు ఎన్ఐఏ చేరవేసింది. శ్రీలంకలో దాడులు జరగడానికి ఒక వారం ముందు కూడా ఈ హెచ్చరికలు జారీ చేసింది ఎన్ఐఏ. ఇక శ్రీలంకలో పెరిగిపోతున్న ఇస్లాం అతివాదం, భారత్ శ్రీలంక సత్సంబంధాలు, పాకిస్తాన్ శ్రీలంక సత్సంబంధాలపై లేఖలో పేర్కొన్నారు.
దాడులకు తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మాత్రం పలు దేశాల్లోని ఉగ్రవాద సంస్థలు ఇందుకు కారణం అని చెప్పుకుంటూ వస్తోందని ఆ పత్రిక ప్రశ్న సంధించగా... ఇందుకు సమాధానం ఇచ్చారు రణిల్ విక్రమసింఘే. ఇప్పటి వరకు దాడుల వెనక ఏదేశానికి చెందిన ఉగ్రవాదులు ఉన్నారో ఇంకా తెలియరాలేదని దానిపై విచారణ సాగుతోందని చెప్పారు. ఉపఖండంలో అన్ని దేశాలు ఉగ్రవాదానికి బలవుతున్నాయని .. తమ దేశంలోకి ఉగ్రవాదం ప్రవేశించకుండా భారత్ మంచి ప్రయత్నం చేసిందని కొనియాడారు. కొన్ని సార్లు రక్షణ వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉన్నప్పటికీ ఉగ్రవాదం ఆదేశంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు తమ దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇతర దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో కలిసి పనిచేసిందని గుర్తు చేసిన రణిల్... అయినప్పటికీ ఇలా తొలిసారి లంక గడ్డపై ఇంత భారీ స్థాయిలో దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీని వెనక ఎవరున్నారో కచ్చితంగా తెలుసుకుని శిక్షిస్తామని చెప్పారు.
ఉగ్రవాదులను గుర్తించేందుకు పాక్ సహకారం కోరుతాం
ఉగ్రవాదం అణిచివేతకు పాకిస్తాన్ శ్రీలంకకు పూర్తి స్థాయిలో సహకరించిందని చెప్పిన రణిల్ విక్రమసింఘే... ఉగ్రవాదులను గుర్తించేందుకు పాక్ సహకారం తీసుకుంటామని చెప్పారు. ఈ దుఃఖః సమయంలో రెండు దేశాల ఒకరికొకరం సహకరించుకుని ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని ఇది తమ మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఈడీని కనిపెట్టింది శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ, ఆత్మాహుతి దాడులతో కూడా ఎల్టీటీఈకి సంబంధాలున్నాయి మరి ఎల్టీటీఈకి దాడులతో సంబంధం ఉందని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు రణిల్ విక్రమసింఘే సమాధానం ఇచ్చారు. ఆత్మాహుతి దాడులు ఎల్టీటీఈకి ట్రేడ్ మార్క్ కాదని అయితే చాలామంది అంతర్జాతీయ ఉగ్రవాదులకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. అయితే తాజా ఘటనతో ఎల్టీటీఈకి సంబంధం ఉందని తాననుకోవడం లేదని రణిల్ చెప్పారు.
ఉపఖండంలో ఉగ్రదాడులు శ్రీలంకకు కూడా పాకాయి
శ్రీలంకలో ముస్లిం సామాజిక వర్గం ఎప్పుడూ వివాదాల్లో లేదు. వారు లౌకికవాదంతోనే ఉన్నారు. అయినప్పటికీ 33 మంది ముస్లింలు ఐసిస్కు ఆకర్షితులయ్యారు. వీరే ఈ దాడుల్లో పాల్గొని ఉండొచ్చని మీరు వ్యాఖ్యానించారు. శ్రీలంకలో ముస్లింలకు సరైన న్యాయం జరగడం లేదని మీరు భావిస్తున్నారా..? అన్న ప్రశ్నకు రణిల్ సమాధానం ఇచ్చారు. ముస్లిం సామాజిక వర్గం 2012 నుంచి 2014 వరకు ఒత్తిడికి గురైన మాట వాస్తవమే అన్నారు రణిల్ విక్రమ్ సింఘే. అయితే 2015 నుంచి వారిలో చాలా మార్పు కనిపించిందని చెప్పారు. "ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కడా గళం వినిపించలేదు. దురదృష్టవశాత్తు ఒకసారి కాండీలో ఓ ఘటన జరిగింది. అయితే దాన్ని అదుపులోకి తీసుకొచ్చాం. ఇక అప్పటి నుంచి ఎక్కడా ముస్లింలకు వ్యతిరేకత పేరుతో దాడులు జరిగిన దాఖలాలు లేవు. అయితే ఉపఖండంలో జరుగుతున్న ఉగ్రదాడులు శ్రీలంకలోకి కూడా ప్రవేశించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవించగలిగే రాజ్యాంగ హక్కును కల్పిస్తున్నాం" అని రణిల్ విక్రమసింఘే తెలిపారు.
ఉగ్రదాడుల వెనక ఉన్న హస్తం ఎవరిదో చేధిస్తామని మోడీ చెప్పారు
దాడులకు సంబంధించి విచారణలో భారత్ ఎలా సహకరిస్తోంది అన్న ప్రశ్నకు రణిల్ సమాధానం చెప్పారు. " ఉగ్రదాడులు వెనక ఉన్న ఉగ్రవాదుల హస్తం ఎవరిది అన్న అంశంపై తేలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చారు. శ్రీలంక అత్యంత సమీప పొరుగుదేశం అయినందున భారత్కు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఎల్టీటీఈని అణిచివేయడంలో నాడు భారత్ సహకారం కూడా ఉంది. తాజాగా జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ మాకు పూర్తి సహకారం అందిస్తోంది" అని రణిల్ తెలిపారు.