పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్పై సౌదీ రాజు ప్రశంసలు, ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీకి పయణం!
కరాచీ: ఓ వైపు జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో తీవ్రవాద దాడి జరిగి నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు అన్నీ ఖండించాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పైన సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రశంసలు కురిపించడం గమనార్హం. సౌదీ రాజు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యమున్న భారత్ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన వ్యాఖ్యల పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ రాజు పాకిస్థాన్కు వచ్చారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్.. సౌదీ రాజుపై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పాకిస్తాన్ వచ్చిన సౌదీ రాజుకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సౌదీరాజు మాట్లాడుతూ... పాకిస్తాన్ను అతి ముఖ్యమైన దేశంగా పరిగణిస్తామని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ఉన్న పాక్కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఆర్థిక, రాజకీయ, రక్షణ రంగాల్లో కలిసి నడుస్తామని చెప్పారు.
ఇరుదేశాధినేతలు దాదాపు ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే ఒప్పందాలపై సంతకాలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. సౌదీ తమకు ఎప్పుడూ అండగా నిలుస్తోందన్నారు. పాక్ కార్మికులు సౌదీలో ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలన్నారు. కాగా, ఇరు దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా.. పాకిస్తాన్కు చెందిన రెండువేల మంది ఖైదీలను విడుదల చేయనుంది.
ఇదిలా ఉండగా, సౌదీ రాజు పాకిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దాయాదుల మధ్య ఉద్రిక్తలు తగ్గించేందుకు కృషి చేస్తామని కూడా సౌదీ రాజు అన్నారని తెలుస్తోంది.