అది ఆక్రమణే, ప్రతిచర్యలు తప్పవు: భారత్కు తేల్చేసిన చైనా ఆర్మీ
బీజింగ్: ఇరుదేశాల మధ్య ఘర్షణ నివారించాలంటే డోక్లాం నుంచి భారత్ సైన్యాలు వైదొలగాల్సిందేనని చైనా సైన్యం(పీఎల్ఏ) సీనియర్ కల్నల్ లీ లీ అన్నారు. చైనా ప్రభుత్వం ఆహ్వానం మేరకు పర్యటిస్తున్న భారత పాత్రికేయులను ఉద్దేశించి సోమవారం బీజింగ్ శివారులోని సైనిక స్థావరంలో ఆయన మాట్లాడారు.
బెడసికొట్టిన డ్రాగన్ వ్యూహం: చైనాకు ఊహించని షాకిచ్చిన భారత్
ఆక్రమణ కిందకే..
‘భారత దళాలు చేసిన పని చైనా భూ భాగాన్ని ఆక్రమించడం కిందకే వస్తుంది' అని ఆయన చెప్పారు. ‘చైనా సైనికులు ఏమని భావిస్తున్నారో మీరు రాయండి. నేను సైనికున్ని. దేశ సమగ్రతను కాపాడడానికి శాయశక్తులా కృషి చేస్తాం. మాకు ఆ సంకల్పం, అంకితభావం ఉన్నాయి'అని తెలిపారు.
Recommended Video
ప్రతిచర్యలు తప్పవు..
భారత మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ.. ‘భారత్ చేపట్టే చర్యలు ఆధారంగానే చైనా సైన్యం ప్రతిచర్యలు ఉంటాయి. అవసరం మేరకు తగిన చర్యలు తీసుకుంటాం. చైనా కమ్యూనిస్టు పార్టీ, సెంట్రల్ మిలటరీ కమిషన్ (దీనికి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు) ఆదేశాలను పాటిస్తాం' అని వివరించారు.
చైనా విన్యాసాలు..
ఈ సందర్భంగా చైనా సైనిక దళాల యుద్ధ విన్యాసాలను భారత పాత్రికేయులకు ప్రదర్శించి చూపించారు. చిన్న తుపాకీలతో గురిచూసి కాల్చడం, ముట్టడిలో ప్రత్యర్ధి దళాలను స్వాధీనం చేసుకోవడం, ఉగ్రవాద వ్యతిరేక దాడులు తదితర అంశాలను ప్రదర్శించారు. డోక్లాం వివాదానికి, దీనికి సంబంధం లేదని లీ లీ చెప్పారు.
2నెలలుగా..
దాదాపు గత రెండు నెలలుగా డోక్లాం వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అక్రమంగా డోక్లాంలో చేరిన చైనా దళాలు వెనక్కి తగ్గకపోగా, భారత దళాలనే వెనక్కిపోవాలని హెచ్చరిస్తుండటం గమనార్హం. అంతేగాక, పలుమార్లు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు హెచ్చరికలు కూడా పంపింది.
దానిపై మాత్రం మౌనమే..
డొక్లాం నుంచి భారత దళాలు వెళ్లిపోయేలా రెండు వారాల్లో చైనా ప్రభుత్వం ‘చిన్న స్థాయి సైనిక చర్య' తీసుకుంటుందన్న అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనంపై ఆయన మౌనం వహించారు. ‘ఇది మీడియా, మేధావుల అభిప్రాయం కావచ్చు' అని సమాధానమిచ్చారు. అక్రమంగా ఉన్న భారత సైనికులను పంపించివేయడానికి బలప్రయోగం జరుగుతుందని షాంగై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీసెర్చిఫెలో హు ఝియాంగ్ చెప్పినట్టు ఆగస్టు 5న గ్లోబల్టైమ్స్ ప్రచురించింది. దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన సీనియర్ కల్నల్ రెన్.. ఇలాంటి అంశాలు అధికార ప్రతినిధుల పరిధిలోకి రావని చెప్పారు. డోక్లాం చైనా భూభాగమే అనడానికి చట్టబద్ధమైన, చారిత్రక ఆధారాలు ఉన్నాయని, అక్కడ రహదారి నిర్మించడానికి తమకు హక్కు ఉందన్నారు. భారత దళాలు తక్షణమే, బేషరతుగా వెనక్కి వెళ్లాలని చెప్పారు. ఇది ఇలా ఉండగా, డోక్లాం వివాదంపై చైనా మీడియాలో అదే దుష్ప్రచారం కొనసాగుతోంది. అధికార పత్రిక చైనా డైలీలో సోమవారం ఇందుకు సంబంధించిన వ్యాసం ప్రచురితమయింది. భారత్ వ్యూహాత్మక తప్పుడు అంచనాల కారణంగా అక్రమ ప్రవేశానికి పాల్పడిందని ఆరోపించింది.