అబూసలేంను పెళ్లాడుతా: కోర్టుకు 26 ఏళ్ల మహిళ
గ్యాంగ్ స్టర్ అబూ సలేంను పెళ్లి చేసుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 26 ఏళ్ల ఓ మహిళ స్పెషల్ టాడా కోర్టును ఆశ్రయించింది. ముంబై సీరియల్ బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న అతను ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
అబూ సలేంను పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేసిందని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తనను వివాహం చేసుకున్నట్టు గతంలో ముంబై సిటీ టాబ్లాయిడ్ ఓ వార్త ప్రచురించడంతో పోలీసులు తన గురించి విచారణ చేశారని సదరు మహిళ పిటిషన్లో పేర్కొంది.
అబూ సలేంతో ఆమె ఉన్న ఫోటోను పలువురికి చూపించి వివాహం గురించి అడిగారని, కానీ పెళ్లి కాలేదని తెలిసిందన్నారు. పోలీసుల దర్యాఫ్తు ఆమె పైన ప్రభావం చూపించిందని, ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేదని, అందుకే అబూ సలేంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
కాగా, నిరుడు కోర్టు విచారణ నిమిత్తం లక్నో పోలీసులు సలేంను రైలులో తీసుకు వెళ్తున్న సమయంలో ఫోన్ ద్వారా ఓ మహిళను పెళ్లి చేసుకున్నట్లు వార్త వచ్చింది. దానిని పరిశీలించిన టాడా కోర్టు ఈ విషయమై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. అయితే, తనకు పెళ్లి కాలేదని అబూ సలేం చెప్పాడు.