దారుణం: పాలు తెమ్మంటే పట్టించుకోని భర్త, చిన్నారి గొంతులో ఉప్పుపోసి చంపిన తల్లి
ఢాకా: బంగ్లాదేశ్లోని ఢాకాలో దారుణం జరిగింది. ఓ తల్లి కన్న కొడుకుకు గొంతులో ఉప్పు పోసి చంపేసింది. భర్త మొహమ్మద్ బచ్చు మియా (30) ఫిర్యాదు మేరకు దోహార్ పోలీసులు అతని భార్య సాథి అక్తర్ను అరెస్టు చేశారు. ఆమెను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. సాథి అక్తర్ వయస్సు 21.
ఆకలితో కన్నబిడ్డ ఏడుస్తుంటే తట్టుకోలేకపోయిన తల్లి, పిల్లాడి గొంతులో ఉప్పు పోసి హత్య చేయడం కలకలం రేపింది. వారికి మూడేళ్ల క్రితం పెళ్ళయింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. ఆ తర్వాత బాబు పుట్టాడు. అతనికి రెండు నెలలు మాత్రమే. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త ఇటీవల పని మానివేసి ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలో పిల్లాడికి పాలు తీసుకురావాలని భర్తకు భార్య డబ్బులు ఇచ్చింది. కానీ అతను ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టి, ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె.. తన రెండు నెలల పిల్లాడు ఆకలితో అలమటించడం కంటే చావడం నయమని, పిడికెడు ఉప్పును తీసుకుని చిన్నారి గొంతులో పోసేసింది.
ఆమె కాసేపటికి కొడుకును ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. కానీ అతను చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో భర్త.. భార్య పైన ఫిర్యాదు చేసాడు. పోలీసులు అరెస్టు చేశారు.