ఉగ్రవాద మహిళను ఉరితీసిన యుఏఈ
రియాద్: ఉగ్రవాద చర్యలకు పాల్పడటంతో పాటు విదేశీ మహిళను దారుణంగా హత్య చేసిన మహిళను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రభుత్వం ఉరి తీసింది. ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడేవారికి ఇలాంటి శిక్ష అమలు చెయ్యాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
యుఏఈ దేశానికి చెందిన అలా బాదర్ అబ్దుల్లా అల్ హషిమి (31) అనే మహిళను సోమవారం ఉరి తీశారు. అయితే ఆమెను ఎక్కడ, ఎలా ఉరి తీశారు అనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. ఇబోల్యా ర్యాన్(47) అనే అమెరికా టీచర్ 2014 డిసెంబర్ 4వ తేదిన అబుదాబిలోని షాపింగ్ మాల్ కు వెళ్లారు.
ఈమె ఇద్దరు కవల పిల్లలకు తల్లి. ఆ సందర్బంలో మాల్ లోని టాయిలెట్ దగ్గర ఉన్న ర్యాన్ ను హషిమి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఆ సందర్బంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన అమెరికన్ వైద్యుడి మీద హషిమి హత్యాయత్నం చేసింది.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద చర్యలను ఈమె విసృతంగా ప్రచారం చేసిందని పోలీసులు గుర్తించారు. కేసు విచారణ చేసిన యుఏఈ కోర్టు హషిమికి ఉరి శిక్ష విదించింది. సోమవారం ఉరి శిక్షను అమలు చేశారు.