విమానంలో హై డ్రామా: ఈ మహిళకు రూ.70 లక్షలు జరిమానా ..!
లండన్: ఈ మధ్యకాలంలో ఏ పేపర్ తిరిగేసినా.. ఏ వార్త చూసిన పది వార్తల్లో కచ్చితంగా ఒక వార్త విమానాలపై కనిపిస్తుంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిందనో, గాల్లో ఉన్న సమయంలో ప్రయాణికుడు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించాడనో... లేక బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లించారనో వార్తలు తరచూ చదువుతున్నాం. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. విమానంను హైజాక్ చేస్తున్నామంటూ చెప్పి బెదిరింపులకు పాల్పడింది ఓ మహిళ.
కోల్ హెయిన్స్ అనే మహిళ తన అమ్మమ్మతో పాటు లండన్ నుంచి టర్కీకి వెళుతోంది. ఒక్కసారిగా విమానంలో అలజడి సృష్టించింది. విమానం హైజాక్కు గురవుతోందంటూ విమానంలో భయాందోళన వ్యక్తం చేసి నానా రభస చేసింది. అంతేకాదు విమానం గాల్లో ఉన్న సమయంలో తలుపు తెరిచే ప్రయత్నం చేసింది. కాక్పిట్ తలపును కూడా బాదేసింది. దీంతో విమాన సిబ్బంది రంగంలోకి దిగింది. వెంటనే విమానంను తిరిగి లండన్లోని స్టాన్స్టెడ్ విమానాశ్రయానికి మళ్లించారు. మహిళను పోలీసులకు అప్పగించారు. ఆమెపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. జెట్2.కామ్ విమానాయాన సంస్థ హెయిన్స్పై జీవితకాల నిషేధం విధించింది. అంటే ఆమె ఈ ఎయిర్లైన్స్లో ఇక ఎప్పటికీ ప్రయాణించలేదు. అంతేకాదు కోర్టు ఆమెకు 105000 పౌండ్లను జరిమానా విధించింది. అంటే మన కరెన్సీలో అది అక్షరాల రూ.70 లక్షలు.
ఈ ఘటన జరగక రెండు వారాల ముందు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన హెయిన్స్ను 28 నెలల పాటు వాహనం నడపకూడదనే ఆంక్షలు విధించారు. అంతేకాదు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినందుకు మతపరమైన చర్యలు కూడా ఆమె పై ఉన్నాయి. ఇక విమానంలో చాలా అలజడి సృష్టించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అందరినీ చంపేస్తానని బెదిరించిందని వారు చెప్పారు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ హైడ్రామా చివరకు సద్దుమణిగిందని చెప్పారు. హెయిన్స్ను పోలీసులకు అప్పగించిన తర్వాత విమానం తిరిగి టర్కీకి బయలుదేరినట్లు చెప్పారు.