అనాటి సంచలనం: ‘ముద్దు’ల నర్స్ ఇకలేరు!
హైదరాబాద్: ఒక్క గాఢమైన ముద్దుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికాకు చెందిన నర్స్ గ్రెటా ప్రైడ్మన్ ఇక లేరు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం, ఆ యుద్ధంలో జపాన్ సేనలు అమెరికాకు లొంగిపోయాయన్న వార్తతో అమెరికాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో అమెరికా వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
అదే సమయం(1945, ఆగస్టు 14న)లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద నర్స్ గ్రెటా ఫ్రైడ్మన్- నావికుడు జార్జ్ మెండాన్సాలు అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకున్నారు.
కాగా, అప్పట్లో ఈ విషయం సంచలనమే అయ్యింది. అప్పుడు తీసిన ఆ ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ ఫొటోలో కనిపిస్తున్న నర్స్ గ్రెటా జిమ్మర్ ఫ్రైడ్మన్(92) ఇటీవల మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె కుమారుడు జోషువా ఫ్రైడ్మన్ అధికారికంగా వెల్లడించారు.
కాగా, ఆ ఫొటోలో ముద్దుపెట్టుకున్నవాళ్లు ప్రేమికులు కాదు. కనీసం ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు కూడా. నావికుడు మెండాన్సా నిజానికి అక్కడే పనిచేసే నర్స్ రిటా పెట్రీని లవ్ చేసి.. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆ ఫొటోలో రిటా కూడా ఉండటం గమనార్హం.
ఈ విషయాన్ని 1980లో గుర్తించారు. కాగా, గత గురువారం వర్జీనియా, రిచ్ మండ్లోని ఆస్పత్రిలో ఫ్రైడ్ మన్ కన్నుమూసింది. దీంతో మరోసారి ఈ ముద్దు ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారి వార్తల్లో నిలిచింది.