నిజమేనా?: సముద్రంలో కొట్టుకుపోయి 18నెలల తర్వాత అక్కడి నుంచే బతికొచ్చింది!
జకర్తా: నైనింగ్ సునర్షియా అనే 53 ఏళ్ల మహిళ జనవరి 2017న సముద్రంలో కొట్టుకుపోయి, 18 నెలల తర్వాత అదే ప్రాంతంలో బంధువులకు కనిపించింది. మరో ఆశ్చర్యమేమంటే నాడు ఏ దుస్తులతో అయితే ఆమె గల్లంతయిందో, అదే దుస్తులతో ఇప్పుడు కనిపించింది. ఈ ఆశ్చర్యకర సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సదరు మహిళ 18 నెలల క్రితం తన కుటుంబంతో కలిసి పశ్చిమ జావా సముద్రంలోని సైట్పస్ బీచ్కు వెళ్లింది. అక్కడ స్నానం చేస్తుండగా అలల తాకిడికి సుముద్రంలో కొట్టుకుపోయింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూటీమ్ ఆమె కోసం తీవ్రంగా గాలించారు. ఫలితం లేకపోవడంతో కొద్ది రోజుల తర్వాత గాలింపు చర్యలను ఆపేశారు.
ఆ కలను తేలిగ్గా తీసుకున్నారు
అయితే నైనింగ్ సునర్షియా బతికే ఉందని ఆమె కుటుంబ సభ్యులలో ఆశ ఉంది. సంవత్సరంన్నర గడిచింది. కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లుగా ఆమె తండ్రికి బతికున్నట్లుగా ఓ రోజు కల వచ్చింది. మొదట దీనిని తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత అదే కల వరుసగా వచ్చింది. బీచ్ ఒడ్డున ఆమె అచేతనావస్థలో పడి ఉన్నట్లు కలలో కనిపించింది.
అపస్మారకస్థితిలో పడి ఉంది
దీంతో ఓసారి బీచ్ వద్దకు వెళ్లి చూడాలని ఆ తండ్రి నిర్ణయించుకున్నాడు. తన కుటుంబసభ్యులతో కలిసి గత శనివారం సైట్పస్ బీచ్లో ఆమె కోసం గాలించారు. అర్ధరాత్రి అయినా ఆమె జాడ తెలియరాలేదు. దీంతో వారు తిరుగుపయనం అయ్యారు. అదే సమయంలో కొంత దూరంలో.. ఆమె ఎక్కడ కొట్టుకుపోయిందే, అక్కడే అపస్మారకస్థితిలో కనిపించింది.
బతికే ఉండటంపై సందేహాలు
వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు ఆమె మాట్లాడటానికి కొన్ని వారాల సమయం పడుతుందని తెలిపారు. ఆమె మాట్లాడలేకపోతున్నప్పటికీ తినగలుగుతుంది, తాగగలుగుతుంది. ఇన్ని నెలల తర్వాత కూడా ఆమె బతికి రావడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అతీత శక్తులా, డ్రామాలా?
ఆమె బతికి రావడం వెనుక ఏదో అతీతశక్తి ఉందని కొందరు భావిస్తే, ఆ తండ్రీ కూతుళ్లు కలిసి నాటకం ఆడుతున్నారని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఈ అంశంపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు.