ఉరి తీస్తారు: అయినా ఇద్దరు మహిళల సాహసం
రక్కా: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వారి వల్ల సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, అనేక మంది దేశం విడిచి పారిపోతున్నారని వెలుగు చూసింది.
ఇద్దరు మహిళలు ప్రాణాలకు తెగించి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరాచకాలను ఓ డాక్యుమెంటరి తీశారు. ఆడాక్యుమెంటరీని స్వీడన్ కు చెదిన ఎక్స్ ప్రెసెన్ టీవీ ప్రసారం చేసింది. అందులో ఇద్దరు మహిళలు ముఖాలకు బుర్ఖాలు వేసుకుని సిరియాలోని రక్కా నగరంలో జరుగుతున్న అరాచకాల గురించి గద్గద స్వరంతో వివరించారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ ఖలీఫా రాజ్యానికి రాజధాని రక్కా నగరం అని చెప్పుకుంటున్నారు. రక్కా నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఆ డాక్యుమెంటరీలో చూపించారు. మూడేళ్ల క్రితం కళకళలాడుతున్న రక్కా నగరం నేడు పూర్తిగా బోసిపోయిందని చెప్పారు.
జనం అక్కడక్కడా ఉంటున్నారని అన్నారు. అనేక ప్రాంతాల్లో శిథిలాల భవనాలు కనిపించాయని చెప్పారు. సున్నీలు, సూఫీలకు పవిత్రమైన ఉవాయస్ అల్ ఖర్నీ మసీదు శిథిలాలు ఆ డాక్యుమెంటరీలో చూపించారు. ఆర్మీనియస్ క్యాథలిక్ చర్చి రూపురేఖలు మార్చేసిన ఉగ్రవాదులు తమ సైన్యం ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు.
డాక్యుమెంటరీని చిత్రీకరించిన ఇద్దరు మహిళల్లో ఒకరు తన పేరు ఊమ్ మొహమ్మద్ గా చెప్పుకునింది. అనేక మంది బాధితులు టర్కీ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని వివరించింది. నడిరోడ్డు మీద మోకాళ్ల మీద కుర్చోబెట్టి తలలు నరికేస్తున్నారని వారు వాపోయారు.
ప్రాణాలు పోతాయని, ఉరి తీస్తారని తెలిసినా ఆ మహిళలు దుస్తుల్లో రహస్యంగా కెమెరాలు పెట్టుకుని డాక్యుమెంటరి తీశారు. ప్రస్తుతం రక్కా నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని జీవనశైలిని ప్రంపంచానికి చూపించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాల గురించి ఓ డాక్యుమెంటరీని తీశారు.