పాక్ భూభాగం పై ఉన్న ఉగ్రసంస్థలను ఏరిపారేస్తాం, దాడులు జరగనివ్వం: ఇమ్రాన్ ఖాన్
విదేశాల్లో పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రదాడులు జరపడాన్ని ఎంతమాత్రం సహించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామ్ మిలిటెంట్ సంస్థలను ఏరిపారేయాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇమ్రాన్ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద సంస్థలను ఏరిపారేయాలని ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చర్యలకు ఉపక్రమించారు. పుల్వామా దాడుల తర్వాత ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది.
నాడు ఏమీ మాట్లాడని ప్రభుత్వాలు నేడు నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాయి: విపక్షాలపై మోడీ ఫైర్
ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై పాకిస్తాన్ గడ్డపై ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా భారత మిలటరీ స్థావరాలపై దాడి చేయాలని భావించినప్పటికీ మన వైమానిక బృందాలు తరిమి కొట్టాయి. ఈ క్రమంలోనే అమెరికా, బ్రిటన్తో సహా పలు ప్రపంచదేశాలు పాక్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరాయి.
ఇదిలా ఉంటే భారత బలగాలపై దాడులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను వినియోగిస్తుందనేది చరిత్ర తిరిగేస్తే తెలుస్తుందని భారత్ చెబుతోంది. అయితే భారత్ ఆరోపణలను పాకిస్తాన్ కొట్టిపారేస్తూ వచ్చింది. ఆ తర్వాత సోమవారం రోజున ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే గురువారం 182 మతపరమైన పాఠశాలలను పాకిస్తాన్ మూసివేయించింది. ఈ పాఠశాలలను నిషేధిత సంస్థలు నడుపుతున్నాయి. ఇక దీనికి సంబంధించి 120 మందిని కూడా పాక్ అధికారులు అరెస్టు చేశారు. విదేశాల్లో దాడులు జరిపేందుకు పాకిస్తాన్ భూమి వేదిక కాకూడదని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని ఖాన్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చెప్పారు. ఇక పాకిస్తాన్లో కొత్త శఖం ప్రారంభమైందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలు కంటితుడుపు చర్యలుగా భారత్ అభివర్ణించింది. పాకిస్తాన్ ఓ శాంతియుత దేశంగా ప్రపంచదేశాల సరసన నిలబడాలని ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద సంస్థలను ఏరిపారేయాలన్నది గత కొంతకాలంగా తాము రచించిన వ్యూహంలో భాగమే అని ... భారత్ చెబుతోంది కాబట్టి ఈ దాడులు చేయడం లేదని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.