భారత్కు వ్యతిరేకంగా చైనా ఆటలు సాగనివ్వం- ఐరాసలో ఫ్రాన్స్ స్పష్టీకరణ-కశ్మీర్పై ఊరట
భారత్-పాకిస్తాన్ మధ్య దశాబ్దాల వివాదంగా ఉన్న కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తావించడం ద్వారా పాకిస్తాన్కు మేలు చేయాలన్న చైనా ఆలోచనకు చెక్ పడింది. భద్రతా మండలిలో భారత్కు వ్యతిరేకంగా చైనా ఆటలు సాగనివ్వబోమంటూ ఫ్రాన్స్ తాజాగా స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంలో లబ్ది పొందాలన్న పాకిస్తాన్ కుట్రలకూ బ్రేక్ పడినట్లయింది.
భారత్-ఫ్రాన్స్ మధ్య ప్రతీ ఏటా జరిగే వార్షిక చర్చల్లో భాగంగా మన దేశానికి వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయేల్ మ్యాక్రాన్ దౌత్య వ్యవహారాల సలహాదారు ఇమానుయేల్ బోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. భారత్-ఫ్రాన్స్ల మధ్య దౌత్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే బయటి శక్తుల నుంచి ఎదురవుతున్న ముప్పుపై వీరిద్దరూ చర్చించారు. ముఖ్యంగా పదేపదే ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ చైనా, పాకిస్తాన్ చికాకుపెడుతున్న విషయంలో వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది.
అజిత్ ధోవల్తో సమావేశం తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడి సలహాదారు ఇమానుయేల్ బోనే మాట్లాడుతూ ఐరాసలో భారత్కు వ్యతిరేకంగా చైనా ఆటలు సాగనివ్వబోమన్నారు. కశ్మీర్ వ్యవహారంలో ఐరాసలో నిబంధనల పేరుతో చైనా కుట్రలు చేసేందుకు అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అలాగే సరిహద్దుల విషయంలోనూ చైనాకు వ్యతిరేకంగా భారత్కు తాము అండగా నిలుస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ రెండు అంశాల్లో తమ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని ఇమానుయేల్ బోనే తెలిపారు. మరోవైపు గతంలోనూ పాకిస్తాన్కు చెందిన మసూద్ అజహర్ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐరాస గుర్తించే విషయంలో భారత్కు ఫ్రాన్స్ ఎంతో సాయం చేసింది.