తగ్గేది లేదంటున్న ట్రంప్... ప్రత్యామ్నాయం దిశగా... ట్విట్టర్ 'రాడికల్ లెఫ్ట్' అంటూ తీవ్ర విమర్శలు...
ప్రపంచమంతా విమర్శిస్తున్నా... పద్దతి మార్చుకోవాలని హితబోధ చేస్తున్నా.. ట్రంప్ మాత్రం తన ట్రంపరితనాన్ని,మొండితనాన్ని వీడేలా కనిపించట్లేదు. ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ అధ్యక్ష పదవిని వీడటాన్ని ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి బదులు తీర్చుకునేందుకు తన మద్దతుదారులను రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటా,బయట సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్పై ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
అధికారిక ఖాతా ద్వారా ట్వీట్...
ట్విట్టర్ శాశ్వత నిషేధం,ఫేస్బుక్ తాత్కాలిక నిషేధం విధించడంతో ట్రంప్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. సొంత ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకుని... దాని ద్వారా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు,సందేశాలు ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు అధికారిక ఖాతా POTUS(President of the United States) ద్వారా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ట్రంప్ చేసిన ఈ వరుస ట్వీట్స్ను ట్విట్టర్ కొద్ది నిమిషాలకే తొలగించి ఆయనకు మరో షాకిచ్చింది.
ట్రంప్ ఏమన్నారు..
'భావ ప్రకటనా స్వేచ్చను నిషేధించడంలో ట్విట్టర్ చాలా దూరం వెళ్లింది. నా గొంతు వినిపించకుండా చేసేందుకు... ట్విట్టర్ ఉద్యోగులు డెమోక్రాట్లకు,రాడికల్ లెఫ్ట్ వర్గానికి సహకరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ నాకు ఓటేసిన మీరు... 7.5కోట్ల మంది గొప్ప దేశభక్తులు.ట్విట్టర్ ఒక ప్రైవేట్ కంపెనీ కావొచ్చు.కానీ సెక్షన్ 230 లేకపోతే ఆ సంస్థ ఎక్కువ రోజులు మనుగడలో ఉండదు ' అంటూ ట్రంప్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
ట్విట్టర్పై తీవ్ర వ్యాఖ్యలు...
'ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే వేరే సైట్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే పెద్ద ప్రకటన చేయబోతున్నాం. అలాగే సొంత ఆన్లైన్ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. మేము మౌనంగా ఉండేది లేదు...ట్విట్టర్ ఉన్నది భావ ప్రకటనా స్వేచ్చ కోసం కాదు... రాడికల్ లెఫ్ట్ను ప్రమోట్ చేసేందుకే...ఇక్కడ ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులకు మాత్రమే స్వేచ్ఛగా మాట్లాడటానికి అనుమతి ఉంటుంది.' అని ట్రంప్ ట్విట్టర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ ఖాతాపై శాశ్వత నిషేధం...
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ భవనంపై దాడికి ట్రంప్ తన ట్విట్టర్ సందేశాల ద్వారా మద్దతుదారులను రెచ్చగొట్టడంతో ఆయన ఖాతాపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ట్రంప్ చేస్తున్న ట్వీట్లు,వాటి పర్యవసానాలు పరిశీలించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది. అటు ఫేస్బుక్ కూడా బైడెన్ ప్రమాణ స్వీకారం వరకూ ట్రంప్ ఖాతాపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.