మళ్లీ సైబర్ అటాక్.. ఈసారి ‘పెట్యా’ రాన్సమ్ వేర్.. భారత్ పై కూడా దాడి!
'వాన్నా క్రై' వైరస్ ప్రపంచాన్ని వణికించిన సంగతిని మర్చిపోక ముందే మరో సైబర్ దాడి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది.
మాస్కో: ఇటీవల 'వాన్నా క్రై' వైరస్ ప్రపంచాన్ని వణికించిన సంగతిని మర్చిపోక ముందే మరో సైబర్ దాడి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. తాజాగా 'పెట్యా' అనే రాన్సమ్ వేర్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.
ఈ వైరస్ తొలుత ఉక్రెయిన్ పై పంజా విసిరి, ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ యూరప్ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఈ రాన్సమర్ వేర్... భారత్ ను కూడా టార్గెట్ చేసిందని స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ తెలిపింది. 'పెట్యా' హిట్ లిస్టులో భారత్ ఉందని హెచ్చరించింది.
చదవండి: అసలేమిటీ జీఎస్టీ? వినియోగదారుడికి అంతిమంగా లాభమా? నష్టమా?
యూరప్ దేశాలపై అటాక్...
తాజా సైబర్ దాడికి యూరప్ దేశాలలోని పెద్దపెద్ద కంపెనీలు, బ్యాంకులు విలవిల్లాడిపోయాయి. ‘పెత్యా' రాన్సమ్వేర్ పేరుతో మంగళవారం జరిగిన ఈ సైబర్ దాడి కారణంగా విద్యుత్తు వ్యవస్థ సైతం స్తంభించిపోయింది. ఫ్రాన్స్లోని నిర్మాణ సామగ్రి సరఫరా సంస్థ అయిన సెయింట్ గోబియెన్ నుంచి రష్యాలోని చమురు సంస్థ రాస్నెఫ్ట్ వరకు అనేక కంపెనీలపై దీని ప్రభావం కనిపించింది. ప్రధానంగా ఉక్రెయిన్ ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సరఫరా సంస్థలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నౌకాయాన సంస్థలు, కంటైనర్ టెర్మినళ్లు, న్యాయ సేవలందించే సంస్థలు, చమురు-సహజవాయు సంస్థలు, ఆహార సరఫరా కంపెనీలు తమ కంప్యూటర్లు, లాప్టాప్లు మాల్వేర్ బారిన పడ్డాయని వెల్లడించాయి. పరిస్థితిని అంచనా వేసి, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.
కంప్యూటర్ స్క్రీన్లపై సందేశాలు..
స్పెయిన్ టెలికాం సంస్థలు, జర్మనీ రైల్వే, యూకేలోని వైద్య సంస్థలు ఈ పెట్యా వైరస్ బారిన పడ్డాయి. ‘మీ ఫైళ్లు మీకు ఇకపై అందుబాటులో ఉండవు. వాటిని కనిపించకుండా చేశాం. 300 డాలర్లను బిట్కాయిన్ డిజిటల్ కరెన్సీ రూపంలో చెల్లించండి' అనే డిమాండ్ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించడంతో పలువురు బాధితులు ఈ మెసేజ్ ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ మెసేజ్ లో పేర్కొన్న ఈ-మెయిల్ చిరునామాకు వార్తాసంస్థలు ఎన్ని సందేశాలు పంపించినా వాటికి సమాధానాలు మాత్రం రాలేదు. అనూహ్యమైన దాడి జరిగినా కీలక వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే చాలా దేశాల్లో బ్యాంకు సేవలు స్తంభించిపోయాయి.
కంప్యూటర్లను ఆపేయండి...
విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తున్న కంప్యూటర్లను ఆఫ్ చేసి, వాటికి విద్యుత్తు సరఫరానూ కూడా తొలగించాల్సిందిగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సూచించాయి. ఓ వైరస్ను తొలగించడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్గా భ్రమింపజేసి హ్యాకర్లు ఈ దాడికి పాల్పడినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. గత నెలలో జరిగిన వాన్నాక్రై దాడి మాదిరిగానే ఇది కూడా ఉందని పేర్కొంటున్నారు. తాజా దాడిలో 150 దేశాల్లో 2.30 లక్షలకు పైగా కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి. మనుషులతో ప్రమేయం లేకుండా దానంతట అదే వ్యాపించేలా దీనిని తీర్చిదిద్దారని భావిస్తున్నారు. ఒక అంటువ్యాధి ప్రబలినట్లు ఇది వ్యాపిస్తుంటుందని చెబుతున్నారు.
మన దేశంలో కూడా...
ఇప్పటికే యూరప్ ఖండంలోని బ్రిటన్, రష్యాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. యూరప్ లోని పలు సెంట్రల్ బ్యాంకులు, పెద్దపెద్ద సంస్థలపై దాడి జరిగినట్టు సమాచారం. రష్యాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ 'రాస్నెఫ్ట్' ఇప్పటికే సైబర్ దాడికి గురైంది. ఇక ఆసియా ఖండంలోని మన దేశం విషయానికి వస్తే, దేశంలోనే అతిపెద్ద కంటెయినర్ పోర్టు అయిన 'జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్'పై పెట్యా సైబర్ దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోర్ట్ ట్రస్ట్ కు చెందిన కొన్ని కస్టమర్స్ రిలేటెడ్ సర్వర్లను, సైట్లను హ్యాక్ చేసింది పెట్యా వైరస్. దీంతో పోర్ట్ లోని కార్యకలాపాలు స్థంభించిపోయాయి. జేఎన్పీటీ లో భాగమైన మొల్లెర్ మాయెర్స్క్ లాజిస్టిక్ కంపెనీ కి చెందిన బిజినెస్ యూనిట్స్, సైట్లను హ్యాక్ చేసింది పెట్యా రాన్సమ్ వేర్. దీంతో మాయెర్క్స్ కంపెనీ కి చెందిన సర్వర్లన్లీ డౌన్ అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎథికల్ హ్యాకర్స్ పెట్యా రాన్సమ్ వేర్ ని సర్వర్ల నుంచి తీసేసే పనిలో పడ్డారు.