పాములు, గబ్బిళాల మాంసం అమ్మకాలపై నిషేధం: కప్పలకు ఓకే: క్రూరమృగాల మాంసంపైనా
బీజింగ్: ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేసి, అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు పేకమేడల్లా కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణమైంది కరోనా వైరస్. ఇప్పటికే లక్షలాదిమందిని పొట్టనబెట్టుకుంది. మరో అరకోటి మందికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడి ఆసుప్రతుల పాలయ్యారు. ప్రపంచం గమనాన్ని సమూలంగా మార్చివేసింది కరోనా. ఇంతటి విపత్తుకు కారణమైన కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న చైనా.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సంప్రదాయ వంటకాల్లో భారీ మార్పులను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి వుహాన్ సిటీకే దీన్ని పరిమితం చేసినా.. క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.
83 రోజుల తరువాత తొలిసారిగా మోడీ: ఆ రెండు రాష్ట్రాల్లో ప్రధాని టూర్: ఆదుకోవడానికి ప్యాకేజీ
సంప్రదాయ వంటకాల్లో భారీ మార్పులు..
భారత్ వంటి అనేక దేశాలు చూడ్డానికే సలపరం పుట్టించేలా కనిపించే కొన్ని రకాల జంతువులు, క్షీరదాల మాంసాన్ని తేలిగ్గా ఆరగించేస్తారు చైనీయులు. వాటి ముక్కలు లేనిదే ముద్ద కూడా దిగదు వారికి. పాములు, కప్పలు, తేళ్లు, ఎలుకలు, గబ్బిళాలు.. ఇలా ఒక్కటని కాదు.. దాదాపు అన్ని రకాల జంతువుల మాంసాన్ని రుచి చూడని చైనీయులు బహుశా ఉండకపోవచ్చు. వాటిని తినడం చైనీయులు కొత్తేమీ కాదు. శతాబ్దాల నుంచి సంప్రదాయబద్ధంగా వస్తోంది అది. చైనీయుల జీవనశైలిలో అలాంటి అలాంటి ప్రాణులు తినడం భాగమైంది.
వుహాన్తో ఆరంభం..
కచ్చా, పక్కాగా ఇలా ఏది పడితే అది తినడం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తును చేపట్టాల్సి ఉంటుందంటూ భారత్ సహా అన్ని దేశాలు కూడా గళమెత్తుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా దర్యాప్తును నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పులి, పాంగోలిన్, గబ్బిళాల వంటి మాంసం అమ్మకాలపై నిషేధాన్ని విధించింది. చైనీయులు ఇష్టంగా తినే పాముల మాంసాన్ని కూడా నిషేధం జాబితాలోకి చేర్చింది.
క్రమంగా దేశవ్యాప్తంగా..
ఈ మేరకు వుహాన్ మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. అయిదేళ్ల పాటు ఈ చట్టం అమల్లో ఉంటుంది. ప్రారంభంలో వుహాన్ మున్సిపాలిటీ పరిధిలో అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు లేకపోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అలాంటి ప్రాణులను తినడమేనంటూ శాస్త్రవేత్తలు కూడా కుండబద్దలు కొట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో వాటి జోలికి వెళ్లాలని అనుకోవట్లేదు చైనా పాలకులు. దశలవారీగా అన్ని ప్రావిన్సుల్లోనూ కొన్ని రకాల వన్యప్రాణులు, క్షీరదాల మాంసం విక్రయాలపై చెక్ పెట్టబోతోంది.
Recommended Video
వెజిటేరియన్కు ప్రాధాన్యత..
వన్యప్రాణుల మాంసం అమ్మకాలకు ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తోంది చైనా ప్రభుత్వం. వాటికి ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. గ్ఝియాంగ్జీ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున పండ్లు, కూరగాయలను సాగు చేయడానికి రాయితీలను ప్రకటించినట్లు తెలుస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, శాకాహార భోజన అలవాట్లను చైనీయుల్లో పెంపొందించే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. పండ్లు, కూరగాయలను పండించడానికి ముందుకొచ్చే రైతులను ప్రోత్సహించడానికి కొన్ని పథకాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.