కోటి 10 లక్షల మందికి కరోనా వైరస్ పరీక్షలు, డ్రాగన్ కీలక నిర్ణయం.. ఎక్కడంటే...
వుహాన్.. కరోనా వైరస్ ఆవిర్భవించింది ఇక్కడే. చైనాలోని ఈ నగరం పేరు వింటేనే ప్రపంచం భయపడే పరిస్థితి నెలకొంది. వైరస్ సోకిన తర్వాత 76 రోజుల లాక్ డౌన్ విధించి.. పటిష్టంగా అమలు చేయడంతో వైరస్ తగ్గుముఖం పట్టింది. కానీ తర్వాత వైరస్ కేసులు వెలుగుచూడంటో వెన్నులో వణుకు మొదలైంది. వైరస్ వ్యాపించడం ఏంటీ అని చైనా అధికార సిబ్బంది తలలు పట్టుకున్నారు. అయితే ఇందుకోసం చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకుంది.
వైరస్ కేసులు వెలుగుచూసినందున.. వుహాన్లో ఉన్న 11 మిలియన్లు.. అంటే కోటి 10 లక్షల జనాభాకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని చైనా ప్రభుత్వం భావిస్తోందని చైనా మీడియా పేర్కొన్నది. ప్రజల ఇంటికెళ్లి న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేయాలని అధికారులు ఆదేశించారని మీడియా తెలిపింది. ప్రతీ జిల్లాలో 10 రోజుల కాలపరిమితితో పరీక్షలు చేయాలని స్పష్టంచేశారు. ఏప్రిల్ 8వ తేదీన 76 రోజుల లాక్ డౌన్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే డోంగ్లీ నివాస సముదాయంలో ఆదివారం, సోమవారం ఆరు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆందోళన నెలకొంది.
వైరస్ వ్యాప్తి చెందడంతో దేశవ్యాప్తంగా చైనా లాక్ డౌన్ విధించింది. అయితే వైరస్ కేసులు తగ్గడంతో నిబంధనలు సడలించడంతో సమస్య మొదలైంది. రష్యా సరిహద్దు రాష్ట్రాలు జిలిన్, హిలాంగ్గియాంగ్లలో పాజిటివ్ కేసులు పెరిగాయి. వైరస్ వ్యాప్తి చెందడంతో విదేశీయులను దేశంలోకి చైనా అనుమతించని సంగతి తెలిసిందే. వైరస్ ఆవిర్భవిచిన వుహాన్లో 3 వేల 869 మంది చనిపోయారు. ఇతర చోట్ల కూడా జనం చనిపోయారు. వుహాన్ మార్కెట్ ద్వారా వైరస్ వ్యాపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.