చైనా అధ్యక్షుడిపై షాకింగ్ వీడియో - జిన్+హిట్లర్=జిన్ట్లర్ - అచ్చంగా అవే స్ట్రాటజీలు - డ్రాగన్ ఫైర్
''ఒకరు కరడుగట్టిన జాతీయవాది.. ఇంకొకరు పక్కా సామ్యావాది.. కానీ వ్యవహారంలో ఆ ఇద్దరూ నియంతలే. 20వ శతాబ్దపు జర్మనీలో సంపూర్ణ శక్తిని పొందిన అడాల్ఫ్ హిట్లర్, రెండో ప్రపంచ యుద్ధాన్ని రగిలించడం ద్వారా ప్రపంచ చరిత్రను మార్చాడు. 21వ శతాబ్దంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తన విస్తరణవాద ధోరణితో మరోసారి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడు. ఇది ఊరికే చెబుతున్నమాట కాదు. కావాలంటే ఈ చారిత్రక రుజువులు చూడండి..'' అంటూ రూపొందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో సంచలనం రేపుతున్నది.
చైనా కిరికిరితో దెప్సాంగ్ లో హైటెన్షన్ - డ్రాగన్ ఆర్మీతో కీలక చర్చలు - ఐఏఎఫ్ యుద్ధ సన్నద్ధత..
జిన్+హిట్లర్=జిన్ట్లర్
స్వదేశాల్లో తిరుగులేని నేతలుగా ఎదిగిన హిట్లర్, జిన్ పింగ్.. అచ్చుగుద్దినట్లు ఒకే స్ట్రాటజీలు ఫాలో అయిన తీరును వివరిస్తూ, ఇద్దరి ఎదుగుదలకు దారి తీసిన పరిస్థితుల్ని విశ్లేషిస్తూ ‘‘స్టాట్ న్యూస్ గ్లోబల్'' సంస్థ ఆగస్టు 1న ఓ వీడియోను పబ్లిష్ చేసింది. అధికారం చేజిక్కిన తర్వాత ఇద్దరూ ఒకేలా వ్యవహరించారని, నియంతృత్వం, విస్తరణవాదంలో హిట్లర్ కు జిన్ పింగ్ ఏమాత్రం తీసిపోరని, అందుకే ఇద్దరి పేర్లను కలిపేస్తూ(జిన్+హిట్లర్) వీడియోకు ‘‘జిన్ట్లర్'' శీర్షిక పెట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది. వీడియోలో చెప్పిన విషయాలను యథాతథంగా రాసుకొస్తే..
హిట్లర్ పోయిన దశాబ్దానికి..
‘‘20 వ శతాబ్దపు జర్మనీలో సంపూర్ణ శక్తిని కలిగి ఉన్న అడాల్ఫ్ హిట్లర్, రెండవ ప్రపంచ యుద్ధంతో ప్రపంచ చరిత్రను మార్చాడు. ఆయన మరణించిన దశాబ్దం తర్వాత.. జర్మనీకి దూరంగా.. చైనాలో మరో వ్యక్తి జన్మించారు. కాల క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ ‘‘కోర్(కేంద్రకం)'' తానే అని, చైనా దేశపు కల కూడా తానేనని, అనియంత్రిత శక్తిమంతుడిగా జి జిన్పింగ్ ఎదిగారు. విస్తరణవాదం ప్రవర్తనలో జిన్ పింగ్, హిట్లర్ మధ్య సమాన పోలికలున్నాయి.
సంక్షోభంలో ఎదుగుదల..
1929లో తలెత్తిన గ్రేట్ డిప్రెషన్(మహా ఆర్థిక సంక్షోభం) సమయంలో హిట్లర్ రాజకీయంగా బలపడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్షీణించి, పేదరికం తాండవిస్తోన్న సమయంలో ఆర్థిక సంస్కరణల ద్వారా జర్మన్ ఆధిపత్యాన్ని నిలబెడతానంటూ ఆయన అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సరిగ్గా జిన్ పింగ్ కూడా 2008నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలోనే కమ్యూనిస్టు పార్టీలో ఆధిపత్యాన్ని సాధించారు. చైనాను మహోన్నత శక్తిగా తీర్చిదిద్దుతానంటూ తెరపైకి దూసుకొచ్చారు. తీరా అధికారం చేజిక్కిన తర్వాత ఆ ఇద్దరూ..
జగన్ పై సోము వీర్రాజు ‘అయోధ్య' అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?
ప్రత్యర్థులు ఖతం.. అన్నింటా పట్టు..
1933లోజర్మనీ చాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన అడాల్ఫ్ హిట్లర్.. ఏడాది తిరిగేలోపే ఫ్యూరర్(మహానేత)గా రూపాంతరం చెందారు. 2008లో చైనా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన జిన్ పింగ్.. నాలుగేళ్ల వ్యవధిలోనే కమ్యూనిస్ట్ పార్టీని, సెంట్రల్ మిలటరీని హస్తగతం చేసుకున్నారు. సొంత పార్టీలో తన ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవాళ్లు, బయటి నుంచి ప్రశ్నించేవాళ్లు, వ్యతిరేక తీర్పులిచ్చే జడ్జిలు.. ఇలా తమకు అడ్డొచ్చిన అందరినీ ఆ ఇద్దరు నేతలు ఖతం చేసేశారు. హిట్లర్ తన ప్రత్యర్థుల్ని చంపిపారేస్తే, జిన్ పింగ్ మాత్రం వాళ్లను జైళ్లపాలు చేశారు. దేశాధినేతలుగా ప్రతి చిన్న విభాగంపై ఆ ఇద్దరూ తిరుగులేని పట్టు సాధించిన తర్వాత అసలు కథ మొదలవుతుంది..
రహస్యంగా సైనిక వ్యూహాలు..
నాడు హిట్లర్ నాయకత్వంలోని జర్మనీ, నేడు జిన్ పింగ్ సారధ్యంలోని చైనా సైనిక పరంగా కొత్త పుంతలు తొక్కాయి. అతి రహస్యంగా సంపత్తిని పెంచుకోవడం, వినూత్న, వ్యూహాత్మక పద్ధతులు అవలంభించడంలో తమకు తామే సాటి అన్నట్లుగా ఇద్దరి తీరు సాగింది. మూడేళ్ల వ్యవధిలోనే హిట్లర్ జర్మన్ నేవీని బ్రిటన్ కు దీటుగా నిలబెడితే, 2030 నాటికి చైనా నౌకాదళం బలం అమెరికాను తలదన్నే స్థాయికి చేరేలా జిన్ పింగ్ చర్యలు చేపట్టారు. జర్మనీలో ఒకప్పుడు ‘‘హెయిల్ హిట్లర్'' జాతీయ నినాదంగా ఉండగా, ఇప్పుడు చైనాలో జిన్ పింగే అన్నింటికీ కేంద్రం(కోర్) అనే భావన బలంగా నాటుకుపోయింది. మావో జెడాంగ్ కంటే జిన్ పింగే గొప్పవాడనే తీర్మానాలు, ఆయన ఆలోచనలకు రాజ్యాంగంలో చోటు కల్పించడం లాంటి చర్యలు అందరికీ తెలిసినవే.
పొరుగు దేశాలపై దాడుల్లోనూ అదే స్ట్రాటజీ..
అంతర్జాతీయ శాంతి ఒప్పందాల్ని గౌరవిస్తామంటూ ప్రకటనలు చేయడం.. అంతలోనే పొరుగుదేశాలపై దాడులకు పాల్పడటంలో హిట్లర్, జిన్ పింగ్ ఒకే తరహా స్ట్రాటజీని అవలంభించారు. పొరుగు దేశాల్లో జర్మన్లు నివసిస్తోన్న ప్రాంతాలన్నీ తమకే చెందినవని హిట్లర్ వాదించగా.. భూటాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు చైనా సాంప్రదాయక భూభాగాలేనని జిన్ పింగ్ చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై చెప్పే మాటలకు విరుద్ధంగా ఆయా ప్రాంతాల్లో సైనిక మోహరింపులకు దిగారు. ఆస్ట్రియా, పోలాండ్ దేశాలను జర్మనీలో విలీనం చేసుకోడానికి హిట్లర్ ప్రయత్నించగా.. ఇప్పుడు జిన్ పింగ్ కూడా తైవాన్, హాంకాంగ్, దక్షిణ చైనా సముద్రంలోని దీవుల్ని చైనాలో కలిపేసేందుకు తహతహలాడుతున్నారు.
తప్పుడు సాకులతో దాడులు..
జర్మనీకి చెందిన రేడియో స్టేషన్ ను నేలకూల్చారన్న తప్పుడు సాకుతో హిట్లర్.. 1939, సెప్టెంబర్ 1న పోలండ్ పై దాడికి దిగాడు. తూర్పు లదాక్ లోని తన భూభాగంలోకి భారత సైన్యం అక్రమంగా ప్రవేశించిందనే తప్పుడు సాకుతోనే జిన్ పింగ్.. 2020, మే 5న తన సైన్యాలను భారత్ పైకి ఉసిగొల్పాడు. మొత్తంగా విస్తరణవాదం, నియంతృత్వ ధోరణిలో ఈ ఇద్దరు ఎవరికెవరూ తీసిపోరు. నాడు హిట్లర్ వినాశనానికి కారణమైతే ఇప్పుడా పాత్రను జిన్ పింగ్ పోషిస్తున్నారు'' అని ‘‘స్టాట్ న్యూస్ గ్లోబల్'' తన వీడియోలో పేర్కొంది.
Recommended Video
సంచలన వీడియోపై డ్రాగన్ ఫైర్..
దివంగత జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో ప్రస్తుత చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ ను పోల్చుతూ ‘స్టాట్ న్యూస్ గ్లోబల్' రూపొందించిన వీడియో ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. దీనిపై ఇండియాలోని చైనీస్ ఎంబసీ తీవ్రంగా స్పందించింది. ఆగస్టు 1న పబ్లిష్ అయిన సదరు వీడియోను వెంటనే తొలగించాలంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ‘‘ఇది మా సుప్రీం కమాండర్ కు సంబంధించిన సున్నితమైన విషయం. ఇలాచేస్తే సంబంధాలు దెబ్బతింటాయి. వెంటనే వీడియోను తొలగించండి..''అని ఎంబసీ అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.