ప్రపంచానికి కరోనా వైరస్ను అంటించి: తన పని తాను చేసుకుంటోన్న వుహాన్: షియోమి డోర్లు ఓపెన్
బీజింగ్: వుహాన్.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోన్న పేరు. చైనా హ్యూబే ప్రావిన్స్లో గల ఈ నగరమే భయానక కరోనా వైరస్కు పుట్టినిల్లు. ఈ నగరంలోనే తొలిసారిగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. వుహాన్ నగరంలోని హునన్ ఫిష్ మార్కెట్లో రొయ్యల మహిళా వ్యాపారిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం దీని బారిన పడింది. వేలమందిని పొట్టనబెట్టుకుంది. లక్షలాది మందిని ఆసుపత్రులు, క్వారంటైన్లపాలు చేసింది.
ప్రపంచానికి కరోనా వైరస్ను అంటించి, వదిలేసిన వుహాన్లో ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ వ్యాపర కార్యకలాపాలు ఆరంభమౌతున్నాయి. సుమారు మూడు నెలల తరువాత వుహాన్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమికి చెందిన వుహాన్ ప్రధాన కార్యాలయం తలుపులు తెరచుకున్నాయి. అక్కడ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.
వూహాన్లోని తమ ప్రధాన కార్యాలయాన్ని పునరుద్ధరించామని, కార్యకలాపాలను ప్రారంభించామని షియోమీ సంస్థ ప్రతినిధులను ఉటంకిస్తూ చైనాకు చెందిన గిజ్మో చైనా బ్లాగ్ వెల్లడించింది. సుమారు మూడు నెలల తరువాత ప్రధాన కార్యాలయాన్ని తిరిగి తెరిచినట్లు పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించడానికి ఉద్యోగులు, సిబ్బందికి ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను అందజేస్తున్నామని స్పష్టం చేసింది.
చిత్తూరు జిల్లాలో ఢిల్లీ మత ప్రార్థనల టైమ్ బాాంబ్: శ్రీకాళహస్తిలో 15 మంది అదుపులోకి..
కట్టుదిట్టమైన నియంత్రణ చర్యల మధ్య షియోమీ తన కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 20న షియోమీ ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేసింది. మూడువేల మంది ఉద్యోగులు ఈ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొంది. అత్యవసర మెడిసిన్ను ఇదివరకే అందజేశామని తెలిపింది.