మెమెన్ ఒకే ఇంటర్వ్యూ:దావూద్పై, ఇంకా ఏమన్నాడు
న్యూఢిల్లీ: నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీయబడిన యాకూబ్ మెమెన్ పదేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. అతను ఇచ్చిన ఒకే ఒక ఇంటర్వ్యూ అది. ఐఎస్ఐ పథకం రచించిందని, తన అన్న టైగర్ మెమన్, అనుచరులు కలిసి అమలు చేశారని, తనకు 1993 బాంబు పేలుళ్లతో సంబంధం లేదని చెప్పాడు.
తాను, అన్న టైగర్ మెమన్, తమ్ముళ్లు, తల్లిదండ్రులతో సహా ముంబైలో ఒకే ఇంట్లో నివసించేవాళ్లమని, టైగర్ మెమన్తో ఎప్పుడూ ఒకేసారి గంటసేపు మాట్లాడిన సందర్భాలే లేవని, అన్నతో తనకు అంత సాన్నిహిత్యం లేదని ఇంటర్వ్యూలో మెమెన్ చెప్పాడు.
పేలుళ్లకు ముందే అన్న ముంబై నుంచి వెళ్లిపోయాడని, పరిస్థితులు బాగాలేవని, ముంబైలో ఉండటం మంచిది కాదని మాకు ఫోన్ చేసి చెప్పాడని, దుబాయ్కి వచ్చేయమన్నాడని చెప్పాడు. 1993 మార్చి 11వ తేదీ, వరుస పేలుళ్లకు ఒకరోజు ముందు మా అమ్మానాన్నలు, తమ్ముళ్లను తీసుకుని నేను దుబాయ్ వెళ్లానని చెప్పాడు.
మార్చి 17వ తేదీ వరకు అక్కడే ఉన్నామని, ఆ తర్వాత అందరం పాకిస్థాన్లోని కరాచీకి చేరుకున్నామని, పాకిస్తాన్ ఏజెంట్ ఆసిఫ్ తమతోనే ఉన్నాడని, మొత్తం అతనే చూసుకున్నాడని, కరాచీలోని దురాయ్ కాలనీలోని ఇంటికి తీసుకెళ్లాడని, ముందు నేను, నా భార్య, తండ్రి, తమ్ముడు అక్కడికి వెళ్లామన్నాడు. తర్వాత కుటుంబ సభ్యులంతా వచ్చారన్నాడు.
ఆ తర్వాత వారం పది రోజులకు తోఫిక్ మమ్మల్ని గుల్షనీ ఇక్బాల్ ఏరియాలోని బంగ్లాకు మార్చాడని, టైగర్ మెమన్కు తోఫిక్ స్నేహితుడని, పాక్కు వెళ్లాక ఆరు నెలలపాటు తాము ఎలాంటి పనీ చేయలేదని చెప్పాడు. ఆ తర్వాత నేను కన్స్ట్రక్షన్ బిజినెస్, మా తమ్ముడు బియ్యం వ్యాపారం మొదలుపెట్టాడని చెప్పాడు.
పాకిస్థాన్ అధికారులు తమకు అన్నిరకాల సహాయ సహకారాలు అందించింది. టైగర్ కుటుంబ సభ్యులం అయినందునే సహకారం అందించి ఉంటుందన్నాడు. 1994 ఏప్రిల్ 17 నుంచి 29వ తేదీ వరకు బ్యాంకాక్లోని పటాయా రోడ్లోని ఒక బంగ్లాలో మమ్మల్ని ఉంచారని చెప్పాడు.
ముంబై పేలుళ్ల కుట్ర గురించి తనకు అక్కడే తెలిసిందని, తమతో పాటు పాక్ ప్రభుత్వ అధికారి కెప్టెన్ ఉస్మాన్ కూడా ఉన్నాడని, మమ్మల్ని బయటికి రానివ్వలేదని, ఆ తర్వాత మమ్మల్ని పాక్ ఏజెంట్ ఆసిఫ్ తిరిగి పాక్కు తీసుకెళ్లాడని చెప్పాడు.
బ్యాంకాక్ నుంచి కరాచీకి వచ్చిన తర్వాతే పేలుళ్ల గురించి సమాచారం సేకరించడం మొదలుపెట్టానని, కరాచీకి వెళ్లాక టైగర్తో చాలాసేపు మాట్లాడానని, ఆయన అప్పుడే అసలు విషయం చెప్పాడన్నాడు. అప్పటి పరిస్థితులను బట్టి తాను ఏం చేయలేకపోయానన్నాడు.
ముంబై పేలుళ్లకు కుట్ర పన్నింది ఐఎస్ఐ అని, సూత్రధారి తోఫిక్ జలియావాలా అని, అతనే మాస్టర్ మైండ్ అని చెప్పాడు. కుట్రను అమలు చేసింది మాత్రం మా అన్న టైగర్ మెమన్, అతని వద్ద పని చేసేవారేనన్నాడు. వారికి కూడా ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందన్నాడు. తోఫిక్ చెప్పినదాని ప్రకారం దావూద్ కూడా పాక్లోనే ఉన్నాడన్నాడు. అతనిని తాను ఎప్పుడూ కలవలేదన్నాడు.
అప్పటి పరిస్థితుల దృష్ట్యా భారత్కు వచ్చి, అన్నీ చెప్పలేకపోయానన్నాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు అన్న చెప్పినట్లు వినక తప్పలేదన్నాడు. కీలకమైన సమాచారం రాబట్టేందుకే వారికి నమ్మకస్తుడిగా మెలిగానని చెప్పాడు. అప్పటికీ నా చుట్టూ నలుగురైదుగురు మనుషులతో నిఘా పెట్టారనిపించేదన్నాడు.
అన్న టైగర్ ఆర్థిక లావాదేవీలు తాను ఎప్పుడూ చూడలేదని, టైగర్ మెమన్ మినహా తమ కుటుంబంలో మరెవరికీ ముంబై పేలుళ్లతో సంబంధం లేదని, పేలుళ్ల గురించి తనకు, మా కుటుంబ సభ్యులకు ముందుగా తెలియదన్నాడు. టైగర్ దీని గురించి మాతో ఎప్పుడూ చర్చించలేదన్నాడు. సమాచారం తెలిస్తే టైగర్ను ఈ పని చేయనిచ్చే వాళ్లం కాదన్నాడు. తమకు సంబంధం లేదని చెప్పేందుకే భారత్ వచ్చామన్నాడు.