ఎనిమిదేళ్ల తరువాత జపాన్ ప్రధాని పీఠంపై కొత్త నేత: అధికారికంగా ఎన్నుకొన్న పార్లమెంట్
టోక్యో: జపాన్ ప్రధానమంత్రిగా యోషిహిడె సుగా అధికారికంగా నియమితులు అయ్యారు. ఆయన నియామకాన్ని ఆ దేశ పార్లమెంట్ అధికారికంగా ధృవీకరించింది. తమ దేశ కొత్త ప్రధానిగా సుగా పేరును ప్రకటించింది. అనారోగ్య కారణాలతో ఇటీవలే ప్రధానమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా వైదొలగిన షింజో అబే వారసుడిగా ఆయనను ఎన్నుకుంది. షింజో అబే రాజీనామాను జపాన్ పార్లమెంట్ ఆమోదించింది. జపాన్ దిగువసభ నేషనల్ డైట్లో బుధవారం నిర్వహించిన ఎన్నికలో యోషిహిడె ఘన విజయాన్ని సాధించారు. 71 సంవత్సరాల యోషిహిడో.. ఇదివరకు చీఫ్ కేబినెట్ సెక్రెటరీగా పని చేశారు.
Recommended Video
జపాన్ కొత్త ప్రధాని ఎవరంటే?: పేద రైతు కుటుంబం నుంచి ప్రధానిగా: అట్టపెట్టెల కంపెనీలో లేబర్గా
దిగువసభలో మెజారిటీ ఓట్లు..
నేషనల్ డైట్లో నిర్వహించిన ఎన్నికల్లో యోషిహిడె విజయం సాధించారు. ఆయనకు అనుకూలంగా 314 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 462 మంది సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఈ ఓటింగ్ను చేపట్టారు. నేషనల్ డైట్లో అధికారి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)కి మెజారిటీ సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలో యోషిహిడె విజయం సాధించినట్లు స్పీకర్్ తడమొరి ఒషిమా ప్రకటించారు. కొత్త ప్రధానిగా ఆయన నియమితులయ్యారని వెల్లడించారు. ఎనిమిదేళ్ల తరువాత జపాన్కు కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యారు.
మంత్రివర్గ విస్తరణకూ
ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని జపాన్ మీడియా వెల్లడించింది. షింజో అబే కేబినెట్లో కొనసాగిన మంత్రులనే తీసుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో జపాన్లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక, వాణిజ్య రంగాల్లో స్థిరత్వాన్ని తీసుకుని రావడం యోషిహిడె ముందున్న సవాళ్లుగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. జపాన్ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించి.. అబెకనిమిక్స్గా ఓ మైలురాయిని నెలకొల్పిన షింజో అబే విధానాలనే ఆయనా అనుసరిస్తారని చెబుతున్నారు.
ఎల్డీపీలో తిరుగులేని నేతగా..
రెండురోజుల కిందటే యోషిహిడె.. అధికార ఎల్డీపీ అంతర్గత ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 534 మంది ఎల్డీపీ పార్లమెంట్ సభ్యులు, ప్రాంతీయ ప్రతినిధులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యోషిహిడోతో పాటు షిగెరు ఇషిబా, ఫ్యుమియో కిషిడ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ఈ ముగ్గురిలో అత్యధిక ఓట్లు యోషిహిడోకు దక్కాయి. ఆయనకు మద్దతుగా 377 ఓట్లు పోల్ అయ్యాయి. దీనితో జపాన్ తదుపరి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది. తాజాగా- దిగువ సభ కూడా ఆయనను ఎన్నుకుంది. బాధ్యతలను చేపట్టడమే మిగిలి ఉంది.
షింజో పదవీ కాలాన్ని భర్తీ..
జపాన్ ప్రధానమంత్రి పదవి నుంచి షింజో అబె తప్పుకొన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోతున్నానంటూ ఆయన పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే వరకూ ఆయన పదవీ కాలం ఉంది. అర్ధాంతరంగా తప్పుకోవడం వల్ల ఆయన వారసుడిని ఎన్నుకోవడానికి జపాన్ అధికార పార్టీ ఎల్డీపీ.. ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో యోషిహిడో సుగా విజయం సాధించారు. షింజో వదిలేసిన పదవీ కాలాన్ని ఆయన భర్తీ చేస్తారు.