అదిరే ఆఫర్: 13 వేలకే 35 ఎకరాల ఫామ్ హౌస్
వాషింగ్టన్: ఓ అద్భుతమైన వ్యాసంతో పాటు 200 డాలర్లు చెల్లిస్తే, తమ ఆరు లక్షల డాలర్ల (సుమారు రూ. 3.8 కోట్లు) విలువ చేసే ఫామ్ హౌస్ను ఇస్తామంటూ అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఓ వృద్ధ జంట ప్రకటించింది. వివరాల్లోకి వెళితే రాండీ సిల్వర్స్, కారొలిన్ బెర్రీ దంపతులు.
ఫామ్ హౌస్ను ఎంత బాగా చూసుకుంటారో వేయి పదాలకు మించకుండా వ్యాసం రాసి అక్టోబర్ 1 నాటికి పంపేవారికి తమ విలువైన ఆస్తిని 200 డాలర్లకు (రూ.13,000)లకే ఇచ్చేస్తామంటున్నారు. అయితే వ్యాసంలో అక్షర దోషాలు, అన్వయ దోషాలు, వాక్యనిర్మాణ దోషాలు ఏవీ ఉండకూడదనే షరతు విధించారు.
అలా వచ్చిన వ్యాసాల్లో 25 వ్యాసాలను ఎంపిక చేసి ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపుతామని, వారు నవంబర్ 26న విజేతను ప్రకటిస్తారని చెప్పారు. అయితే కనీసం 5 వేల వ్యాసాలు, పది లక్షల డాలర్ల సొమ్ము వస్తేనే ఈ ఆఫర్ ఉంటుందని, ఇలా జరగని పక్షంలో ఎవరి సొమ్ము వారికి ముట్టజెప్పి, ఫాం హౌస్ను ఆరు లక్షల డాలర్లకే బేరం పెడతామని వృద్ధ దంపతులు తెలిపారు.
ఇలా చేయడం వెనుక పెద్ద కథే ఉంది. వృద్ధ దంపతుల వ్యాసాల పిలుపుతో కనీసం 5వేల మందైనా వ్యాసాలు, 200 డాలర్లు పంపుతారని వారి అంచనా. అంటే.. అక్షరాలా 10 లక్షల డాలర్లు. రూ.6.40 కోట్ల దాకా వస్తుంది. ఇది ఆ ఫామ్ హౌస్ అసలు విలువకు దాదాపు రెట్టింపు.