అలసిపోయి ఉంటావు: నిర్భయ చివరి మాటలను గుర్తు చేసుకున్న తండ్రి
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత దారుణంగా నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగి రెండేళ్లవుతోంది. ఆమె తల్లిదండ్రులను ఇప్పటికీ విషాదం చుట్టుముట్టే ఉంది. వారితో మాట్లాడడం చాలా ఇబ్బందిగానే అనిపించింది. ఏం మాట్లాడితే ఏం బాధపడుతారో అనే భయం, ఆందోళన ముప్పిరిగొంది. వన్ ఇండియా ప్రతినిధితో నిర్భయ తల్లిదండ్రులు ప్రత్యేకంగా మాట్లాడారు.
వన్ ఇండియా: డిసెంబర్ 16వ తే్దీ సంఘటన తర్వాత మీ జీవితాల్లో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. దానికి ఎవరిని తప్పు పట్టాలి?
తల్లి: నిర్భయకు రిగింది చాలా తప్పు. ఏ మహిళ విషయంలోనూ అటువంటి సంఘటన జరగకూడదు. అయితే, ప్రజలు చైతన్యం పొందారు. భిన్నంగా ఆలోచించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనలు మారాయి, కానీ సంక్లిష్టమైన భారత పాలనా యంత్రాంగం అమలులో జాప్యం చేస్తోంది. దాంతో మార్పేమీ రాలేదు. నా కూతురికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అందుకు ఈ వ్యవస్థను అసహ్యించుకుంటున్నా.
వన్ ఇండియా: భారత్లో అత్యాచారం కేసులు పెరగడానికి ఎవరు కారణమని భావిస్తున్నారు?
తండ్రి: మా కూతురు పరిస్థితి వ్యవస్థనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నా కూతురిపై అత్యాచారం జరిగి రెండేళ్లవుతోంది. దోషులు జైలులో ఉచితంగా భోజనం తింటున్నారు. వ్యవస్థలోని లోపాల వల్ల దోషులకు ఇంకా ఉరి శిక్ష అమలు కాలేదు. ప్రకటన మాత్రం చేశారు, కానీ ఫలితం రాలేదు. ఏదో కారణం వల్ల ప్రజలు చట్టానికి భయపడడం మానేశారు. అందుకే, అత్యాచారాలు పెరుగుతున్నాయి.
వన్ ఇండియా: ఇటువంటి సంఘటనలను ఎలా నిలువరించగలమని భావిస్తున్నారు?
తల్లి: ప్రజలు చట్టానికి భయపడనంత వరకు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మహిళపై దాడి చేస్తే తమకు శిక్ష పడుతుందనే అనుభవం ప్రజలకు వస్తే వారు మారుతారు. పైగా శిక్షలు కఠినంగా ఉండాలి. మహిళపై అత్యాచారం చేయాలంటే వణికిపోవాలి. అత్యాచారం చేసేవాళ్లకు తాము ఏం చేస్తున్నామో తెలుసు, తమకు ఏమీ కాదని అనుకుంటున్నారు.
వన్ ఇండియా: నిర్భయపై దాడి చేసినవారికి తగిన శిక్ష పడిందని భావిస్తున్నారా?
తల్లి: శిక్ష ప్రకటించిన మాట వాస్తవమే. కానీ వారు ఇంకా బతికే ఉన్నారు. ప్రభుత్వ ఖర్చులతో జీవిస్తున్నారు. భారత చట్టాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా కూతురికి న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది. కానీ ఇప్పటి వరకు వారిని ఉరి తీసినట్లు నాకు సమాచారం రావడం లేదు.
వన్ ఇండియా: నిర్భయ సంఘటన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలను ఢిల్లీకి పంపించడానికి భయపడుతున్నారు. మీరేమంటారు?
తండ్రి: నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నేను కూడా భయపడ్డాను. కానీ ప్రభుత్వం నాలో విశ్వాసాన్ని పెంచింది. ఏమైనా, రాజధానిలో అత్యాచారాలు పెరగడం ఏ తండ్రినైనా తమ కూతుళ్లను పంపించడానికి భయపెడుతుంది.
వన్ ఇండియా: ఇది కేవలం బాధితురాలిపై అత్యాచారం మాత్రమే కాదు, కుటుంబంపై కూడా అని భావిస్తారా?
తండ్రి: అత్యాచారం మహిళపై జరుగుతుంది. కానీ వేదనంతా కుటుంబ సభ్యులు అనుభవిస్తారు. అత్యాచారం తర్వాత పోలీసు దర్యాప్తు కుటుంబ సభ్యులను బాధపెడుతుంది. కేసు కోర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదుల ప్రశ్నలు మహిళ మానసిక స్థితిని భయపెడుతాయి. ప్రజల చూపులు, అది సానుభూతిపరులవైనా, ఇతరులవైనా వారి చూపులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఆ రకంగా మహిళ వివిధ స్థాయిలో అత్యాచారానికి గురవుతుంది.
వన్ ఇండియా: సమాజం సంకుచిత దృష్టిని ఎలా రూపుమాపగలమని భావిస్తున్నారు?
ప్రచారాలు, చైతన్యపరిచే కార్యక్రమాలు తప్పనిసరి. తమ చెడు కార్యాల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలి.
వన్ ఇండియా: మహిళలపై నేరాలకు పోలీసులు బాధ్యులని భావిస్తున్నారా?
మహిళలపై అత్యాచారాలకు పోలీసులు కారణం కాదు. పోలీసులు వాళ్ల పనివాళ్లు చేస్తారు. కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి. సమయాన్ని తీసుకుంటాయి. తీర్పు వెలువడడంలో జాప్యం వల్ల నేరస్థుల్లో భయం పోతుంది.
వన్ ఇండియా: జీన్స్, టీ షర్టులు ధరించడం వల్లనే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయనే వాదనతో ఏకీభవిస్తారా?
తండ్రి: చీర ధరించినా, సాల్వారా దుస్తులు ధరించినా మహిళపై అత్యాచారం జరుగుతుంది. వస్త్రధారణ కారణంగానే మహిళలపై అత్యాచారాలు జరుగుతాయనే వాదనను నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అది ప్రజల సంకుచిత మనస్తత్వం.
వన్ ఇండియా: నిర్భయ విషయంలో మీరు ఎక్కువగా గుర్తుంచుకునేది ఏది?
తండ్రి: నిర్భయ ఐసియులో ఉన్నప్పుడు నేను ఆమె కోసం కేక్ తీసుకుని వచ్చి బయట నించున్నాను. ఆమె నన్ను చూసి, లోనికి రమ్మనట్లుగా కదిలింది. వేదనతో కూడిన గొంతుతో - "బాపూ, నువ్వు తిన్నావా, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. ప్లీజ్, కాసేపు నిద్రపో" అని చెప్పి ఆమె నిద్రలోకి జారుకుంది. ఆ నిద్ర శాశ్వతమైపోయింది. మరిచిపోవాలని ప్రయత్నించినా దీన్ని నేను మరిచిపోలేకున్నాను. డిసెంబర్ 29వ తేదీన ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. అదే ఆఖరు.