ప్యారిస్ దాడిలో 18 ఏళ్ల యువకుడి లొంగుబాటు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ కాల్పుల దాడికి సంఘటనకు సంబంధించి 18 ఏళ్ల యువకుడు లొంగిపోయాడు. ఈ సంఘటనలో ముగ్గురు పాలు పంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురిలో చిన్న వయస్కుడు పోలీసుల ముందు స్వచ్ఛందంగా లొంగిపోయాడు.
ఫ్రెంచ్ జాతీయులైన 1980లో పుట్టిన సైద్ కౌచీ, 1982లో జన్మించిన చెరిఫ్ కౌచీ, 1992లో పుట్టిన హమైద్ మౌరాద్ల కోసం పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఉన్న ఫ్రెంచి పత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంలో బుధవారం నాడు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. పత్రికా కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చిన ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందారు.
మరో పదిమంది గాయపడ్డారు. సెంట్రల్ ప్యారిస్లో చార్లీ హెబ్డో వార పత్రిక కార్యాలయం ఉంది. ఇందులోకి చొచ్చుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పత్రిక జర్నలిస్టులు, ఇద్దరు పోలీసులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చార్లీ హెబ్డో వ్యంగ్య రచనలకు పేర పొందిన వార పత్రిక. ఈ వార పత్రిక వివాదాలకు కూడా అంతే పేరు పొందింది. గాయపడ్డ పదిమందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
కాల్పులు జరిగిన పత్రికా కార్యాలయాన్ని ఫ్రెంచ్ అధ్యక్షులు హొలాండే పరిశీలించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఇది ఉగ్రవాదుల చర్య అన్నారు. ఉగ్రవాదాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఓ వర్గానికి చెందిన నేతల పైన వ్యంగ్య కార్డున్లూ వేసినందుకు ఈ కాల్పులు జరిగినట్లుగా భావిస్తున్నారు.
ఈ ఘటనలో పదకొండు మంది చనిపోగా, పదిమంది గాయపడ్డారని, అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంకరుముందు చెప్పారు. అరగంట కింద ఇద్దరు సాయుధులు తుపాకులతో లోపలకు వచ్చారని, ఆ తర్వాత కాల్పుల శబ్ధం వినిపించిందని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు.