వివాదాలకు కేరాఫ్ : జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత
హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. జింబాబ్వేకు అత్యధిక కాలంగా అధ్యక్షుడిగా పనిచేశారు ముగాబే. దాదాపు 37 ఏళ్లు అధ్యక్షుడిగా చేశాకా 2017 ఆయన బలవంతంగా తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాను అంతకుముందు తీసుకున్న నిర్ణయంతో జింబాబ్వేలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం, ఎన్నికల గందరగోళం, మానవ హక్కుల ఉల్లంఘనలు జరగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
రాబర్ట్ ముగాబే మృతిని ధృవీకరించిన అధ్యక్షుడు ఎమర్సన్
రాబర్ట్ ముగాబే మృతి చెందినట్లు ధృవీకరిస్తూ ఆదేశ అధ్యక్షుడు ఎమర్సన్ మంగాగ్వా ట్విటర్ ద్వారా తెలిపారు. ఆయన్ను విముక్తికి చిహ్నంగా అభివర్ణించారు ఎమర్సన్. అయితే పూర్తి వివరాలు తెలపలేదు. 1980లో మైనార్టీలుగా ఉన్న తెల్లదొరల పాలన తర్వాత ముగాబే జింబాబ్వే అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. అంతర్జాతీయ ఆంక్షలు ఉండటం వల్లే జింబాబ్వేలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు. ఇందుకోసమే తాను బతికున్నంత కాలం ఆదేశానికి అధ్యక్షుడిగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే కాలక్రమంలో ఆయన పనితీరుపై అసంతృప్తి పెరగడంతో మిలటరీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆదేశ పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం, ముగాబేను తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ ప్రజలు రోడ్డెక్కడంతో ఆయన రాజీనామా చేశారు.
బలవంతంగా రాజీనామా చేసిన ముగాబే
2017 నవంబర్ 21న తను రాజీనామా చేస్తున్నట్లు ముగాబే ప్రకటించారు. ఆయన ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ముగాబే అధ్యక్షుడిగా ఉన్నకాలంలో స్వేచ్ఛ లేదని అక్కడి ప్రజలు చెబుతూ స్వేచ్చగా సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు ఇక జింబాబ్వేకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని అక్కడి ప్రజలు నాడు పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 21, 2018న అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత ముగాబే తన తొలి పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే తన జన్మదినంను జింబాబ్వే ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది.
పాశ్చాత్య దేశాలపై నిప్పులు చెరిగిన ముగాబే
ముగాబే పాలనలో జింబాబ్వే ఆర్థిక పరిస్థితి అధమస్థాయకి చేరుకుంటున్నప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు. జింబాబ్వేతో పాటు ఆఫ్రికాదేశాల్లో పాశ్చాత్య దేశాల జోక్యం ఎక్కువైపోయిందని అంతేకాకుండా ఆఫ్రికాలోని వనరులను కొల్లగొడుతున్నారని అలాంటి పాశ్చాత్యదేశాలపై పోరు సాగించి తిరిగి తమ వనరులను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు ముగాబే. ఈ పిలుపును అందుకున్న ఆఫ్రికన్లు ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు ప్రారంభించారు. ఆఫ్రికాలో ఉన్న అతి గొప్పవ్యక్తుల్లో ముగాబే కూడా ఒకరు. అయితే పాశ్చాత్య దేశాల నాయకులను ఎలాగైతే చూశారో అలా తనను చూడరాదని కొన్ని సందర్భాల్లో ముగాబే చెప్పేవారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై కూడా విమర్శలు
ముగాబే పాలన ముగిసే నాటికి ఆయన పలు అంతర్జాతీయ పదవులను నిర్వహించారు. 54 ఆఫ్రికా దేశాల సమాఖ్యకు ఛైర్మెన్గా వ్యవహరించారు. సౌత్ ఆఫ్రికా 15దేశాల అభివృద్ధి సమాజంకు కూడా ఛైర్మెన్గా వ్యవహరించారు. ఇక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పై తాను చేసిన విమర్శలను చాలామంది ప్రాంతీయ నాయకులు స్వాగతించారు. ఆఫ్రికన్లను అదే పనిగా లక్ష్యంగా చేసుకుని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పనిచేస్తోందని విమర్శించారు. ఆఫ్రికాదేశానికి క్రిస్టియానిటీని పరిచయం చేసింది తామే అని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయని కానీ మేమొచ్చి, మేము చూసి , మేము మా ప్రాంతాన్ని కైవసం చేసుకున్నామని ముగాబే సౌత్ఆఫ్రికాలో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
ముగాబే సుదీర్ఘ పాలనపై ప్రజల్లో అసంతృప్తి
ఇక జింబాబ్వేకు స్వాతంత్ర్యం సిద్ధించాకా విద్య పై దృష్టి సారించి కొత్త స్కూళ్లను నిర్మించారు. ఇక పర్యాటక రంగం, మైనింగ్ రంగాలు ఒక వెలుగు వెలిగాయి. ముగాబే సుదీర్ఘ పాలనపై అసంతృప్తి వ్యక్తం అవుతూ వచ్చింది. హింస, ఓటింగ్లో అక్రమాలకు పాల్పడి తిరిగి అధ్యక్షుడు అవుతున్నారనేది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 2008లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ నేతల సహకారంతో ఆయన ప్రభుత్వం స్థాపించగలిగారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముగాబే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హింసలో పలు డిగ్రీలు ఉన్నాయని బాహాటంగానే చెప్పారు. ఇక 2013లో తిరిగి అక్రమమార్గాల ద్వారా అధ్యక్షుడయ్యారన్న ఆరోపణలు రాబర్ట్ ముగాబే పై ఉన్నాయి.