జింబాబ్వే అధ్యక్షుడిపై బాంబు దాడి: కొద్దిలో బయటపడ్డానని చెప్పిన ఎమ్మెర్సన్
హరారే: జింబాబ్వే అధ్యక్షులు ఎమ్మెర్సన్ మన్నంగాగ్వాపై బాంబుదాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. జింబాబ్వేలోని బుల్అవే వైట్సిటీ స్టేడియంలో అధికార పార్టీ మీటింగ్కు ఆయన హాజరైన సమయంలో ఈ దాడి జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మర్సన్ ప్రసంగం ముగిసిన వెంటనే బాంబు పేలుడు చోటు చేసుకుంది. భద్రతాదళాలు ఆయనను సురక్షితంగా తరలించారు. ఈ దాడిలో ఉపాధ్యక్షుడు చివాంగ , ఆయన భార్య స్వల్పంగా గాయపడ్డారు. వీరితో పాటు మరికొందరు గాయపడ్డారు.
కొద్దిలో తాను ప్రమాదం నుంచి బయపడ్డానని అధ్యక్షులు మన్నంగాగ్వా తెలిపారు. తనకు కొద్ది దూరంలో ఈ పేలుడు చోటు చేసుకుందన్నారు.
జులై 30న జరగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభ నిర్వహించారు. రాబర్టు ముగాబే 37 ఏళ్ల పాలన అంతమైన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు ఇవి. 93 ఏళ్ల ముగాబే ఇటీవలే అధ్యక్ష పదవి నుంచి వైదొలగి ఎమ్మర్సన్ను నియమించారు.