ఫేస్బుక్ డాటా లీకేజ్: జుకర్బర్గ్కు చుక్కలు చూపిన సెనేటర్లు, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్: ఫేస్బుక్ వినియోగదారుల డేటా లీకేజీ వివాదంలో చిక్కుకున్న ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ రెండో రోజు అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండో రోజు ఆయనను సెనెటర్లు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. జుకర్ బర్గ్ మొదటి రోజు తడబాటు లేకుండా కనిపించాడు.
Recommended Video
రెండో రోజు మాత్రం కాస్త ఆందోళనగా, విసుగ్గా కనిపించారు. హౌస్ ఆఫ్ ఎనర్జీ, కామర్స్ కమిటికీ చెందిన రిపబ్లికన్, డెమోక్రాట్ శాసనకర్తలు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. సంక్లిష్టమైన ప్రశ్నలు సంధించారు. దీంతో జుకర్ బర్గ్ సమాధానాలు చెప్పేందుకు ఇబ్బందిపడ్డారు.
ప్రశ్నలు సంధించారు
జుకర్బర్గ్ను మొత్తం పన్నెండు గంటల పాటు ప్రశ్నించారు. రెండో రోజు ఐదు గంయల పాటు ఆయనను విచారించారు. డేటా లీకేజీతో పాటు కంపెనీ ప్రైవసీ నిబంధనల గురించి, ఒపియాడ్ సంక్షోభం, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్సులో వైవిద్యం లేదని పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు.
జుకర్ బర్గ్ అసహనం
విచారణ సమయంలో ఓ సెనేటర్ జుకర్బర్గ్ను తన ప్రశ్నలకు యస్ లేదా నో అనే సమాధానాలు చెప్పాలని అడిగారు. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు జుకర్ బర్గ్ ఓ దశలో అసహనానికి గురైనట్లు కనిపించారు. మొదటి రోజు పలు ప్రశ్నలకు జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పి, తన తప్పును అంగీకరించారు.
సమాచారం దుర్వినియోగం
ఇకపై డేటా దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తానని జుకర్ బర్గ్ తెలిపారు. చాలా అంశాల్లో తాము మెరుగుపడాల్సి ఉందని వెల్లడించారు. బ్రిటన్కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ నుంచి సమాచారాన్ని తీసుకొని దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే.
కేంబ్రిడ్జి అనలిటికా
అయితే కేంబ్రిడ్జి అనలిటికా తన సమాచారం కూడా తీసుకుందని బుధవారం నాటి విచారణలో జుకర్ బర్గ్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పని చేసిన కేంబ్రిడ్జ్ అనలటికి ఫేస్ బుక్ నుంచి 8.7 కోట్ల మంది వినియోగదారుల సమాచారం తీసుకుందన్న విషయం తెలిసిందే.