మార్కెట్ల పతనం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలి..!
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో స్వతంత్ర భారతంలోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అతి క్లిష్టమైన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. వైరస్ కారణంగా భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.7 శాతానికి పడిపోనుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) 11 శాతంగా ఉంటుందని అంచనా. కరోనా కారణంగా ఆర్థికంగా మనుగడ కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల నుండి పునరుద్ధరణ దిశగా ఈ బడ్జెట్ ఉంటుందని ఎన్నో ఆశలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బడ్జెట్ క్లిష్టమైనదే అంటున్నారు.
కరోనా నేపథ్యంలో వివిధ రంగాలకు ఊరటనిచ్చే ఉద్దేశ్యంలో భాగంగా రియాల్టీ రంగానికి కూడా ప్రోత్సాహకాలు ఉండవచ్చు. దీంతో సిమెంట్ కంపెనీల షేర్లు బడ్జెట్ నుండి సానుకూల సంకేతాలు అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సిమెంట్ షేర్ల వైపు దృష్టి సారించవచ్చునని చెబుతున్నారు. చమురు కంపెనీల షేర్లకు కూడా బడ్జెట్ సానుకూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
గత ఆరు సెషన్లలో మార్కెట్లు వరుసగా నష్టాల్లోకి వెళ్లి, దిద్దుబాటుకు గురయ్యాయి. అయితే పలు కంపెనీల స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. కొన్ని ప్రధాన కంపెనీల షేర్ల వ్యాల్యూ వాటి సగటు పీఈలతో చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఆర్థిక వ్యవస్థ ఎంత కోలుకున్నప్పటికీ ఈ వాల్యుయేషన్స్ సమర్థనీయంగా లేవని అంటున్నారు. బడ్జెట్ సమయంలో ఈ స్టాక్స్ లాభాల స్వీకరణకు గురి కావొచ్చునని అంటున్నారు.
గత పదేళ్లలో బడ్జెట్కు ముందు, బడ్జెట్ రోజున మార్కెట్లు ఎక్కువసార్లు నష్టపోయాయి. మోడీ హయాన్ని పరిగణలోకి తీసుకుంటే బడ్జెట్కు ముందు 30 రోజులు మార్కెట్లు నష్టపోగా, తర్వాత 30 రోజులు దాదాపు స్థిరంగా ఉన్నాయి. 2015లో బడ్జెట్కు 30 రోజుల ముందు లాభాల్లో, బడ్జెట్ తర్వాత 30 రోజులు నష్టపోయాయి. 2016లోను బడ్జెట్కు ముందు నష్టాల్లో, బడ్జెట్ తర్వాత లాభాల్లో ఉంది. 2017లో బడ్జెట్కు ముందు, తర్వాత లాభాల్లో ఉన్నాయి. 2018లో బడ్జెట్కు ముందు లాభాల్లో, బడ్జెట్ తర్వాత నష్టాల్లో ఉండగా, 2019, 2020లలో బడ్జెట్కు ముందు, తర్వాత నష్టపోయాయి.