ఆ డాషింగ్ ఓపెనర్ ప్లేఆఫ్ మ్యాచ్లంటే చేతులెత్తేస్తాడంతే: ఢిల్లీ కేపిటల్స్కు కొత్త తలనొప్పి
అబుధాబి: యునైెటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020.. ఢిల్లీ కేపిటల్స్ తలరాతను మార్చుతుందా? లేక ఎప్పట్లాగే ఫైనల్కు చేరకుండానే తిరుగుముఖం పడుతుందా? ఈ సారి కొత్త ఐపీఎల్ ఛాంపియన్ ఢిల్లీ కేపిటల్స్ రూపంలో ఆవిర్భవిస్తుందా? అనే ప్రశ్నలకు ఇంకొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంది. ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆఫ్ గండాన్ని దాటుకోగలిగితే.. ఈ సీజన్లో విజేతగా ఆవిర్భవించడానికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కుతుందా? లేదా? అనేది అసలు ప్రశ్న.
ఫైనల్ చేరని జట్టు అదొక్కటే..
ఐపీఎల్ టోర్నమెంట్ ఆరంభమైనప్పటి నుంచీ ఇప్పటిదాకా ఢిల్లీ కేపిటల్స్ ఒక్కసారి కూడా ప్లేఆఫ్కు చేరుకోలేదు. ఇదివరకు ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఉన్న సమయంలో కూడా ఆ జట్టు ఫైనల్లో అడుగు పెట్టలేదు. ప్లేఆఫ్లో దశలో చేరుకున్నప్పటికీ..అక్కడి నుంచే వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి మరో మంచి అవకాశం ఆ జట్టుకు వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటుందా? లేదా నిర్లక్ష్యపు ఆటతీరుతో ఫైనల్ గడప తొక్కకుండానే ఇంటిదారి పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
శిఖర్ ధవన్కు ప్లేఆఫ్ దడ..
హేమాహేమీల్లాంటి బౌలర్లకు గుండెపోటు తెప్పించేలా పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుని పడే ఢిల్లీ కేపిటల్స్ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్కు ప్లేఆఫ్ దడ ఉంది. ప్లేఆఫ్, నాకౌట్ మ్యాచులంటే చేతులెత్తేస్తాడంతే. ఈ సీజన్లో కూడా ఇది ఇప్పటికే రుజువైంది. ప్లేఆఫ్ లేదా నాకౌట్ మ్యాచుల్లో తాను ఆడలేననే విషయాన్ని శిఖర్ ధవన్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని అందుకోలేక చతికిల పడింది ఢిల్లీ. ఈ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు సున్నాకే అవుట్ అయ్యారు.
14 ప్లేఆఫ్ మ్యాచుల్లో
ఇప్పటిదాకా 14 ప్లేఆఫ్ మ్యాచ్లను ఆడిన శిఖర్ ధవన్ ఏ మాత్రం రాణించలేకపోయాడు. తన బలహీనతను చాటుకున్నాడు. ఈ 14 మ్యాచుల్లో అతని బ్యాటింగ్ యావరేజ్ 13.86 శాతం మాత్రమే. ఒక్కో మ్యాచ్కు ఒక్కో రన్ చేయలేదు. అతని అత్యధిక స్కోర్ 34. ఇలాంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో నాకౌట్ మ్యాచ్కు సిద్ధపడుతోంది ఢిల్లీ కేపిటల్స్. ఓపెనర్ పృథ్వీ షా వరుస వైఫల్యాలతో పాటు శిఖర్ ధవన్ బ్యాటింగ్ యావరేజ్ ఆ జట్టును కలవరపెడుతోంది. ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే బ్యాటింగ్ లైనప్లో మార్పులకు పూనుకుంటోంది.
స్టోయినిస్తో ఇన్నింగ్ ఆరంభం..
ఈ పరిస్థితుల మధ్య పృథ్వీ షాను తుది జట్టులోకి తీసుకోకపోవడానికే అవకాశాలు ఉన్నాయి. అతనికి బదులుగా స్టోయినిస్తో ఇన్నింగ్ను ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది. స్టోయినిస్.. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అజింక్య రహానే అందుబాటులో ఉన్నప్పటికీ..ఓపెనర్గా పంపించకపోవచ్చు. వన్డౌన్గా అతని స్థానాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పృథ్వీ షా లేదా అజింక్య రహానే.. క్రీజ్లో ఎక్కువ సేపు కుదురుకోలేకపోతున్నారని, వారు త్వరగా అవుట్ అయితే.. మిగిలిన బ్యాట్స్మెన్లపై ఒత్తిడి పడుతోంది. ఫలితంగా- శ్రేయాస్ అయ్యర్ వంటి మినిమం గ్యారంటీ బ్యాట్స్మెన్ కూడా భారీ షాట్లను ఆడలేకపోతున్నాడు.