ఉప్పల్ స్టేడియం గుర్తుకు: ఐపీఎల్లో రికార్డ్ ఛేజింగ్: ఆ 5 మ్యాచ్లు ఇవే: 2008 రికార్డు బ్రేక్
షార్జా: అసలే స్టేడియం చిన్నది. పైగా ఆడుతున్నది ధనా ధన్.. ఫటాఫట్ టోర్నమెంట్. ఎదురుగా కొండలా కనిపిస్తోన్న టార్గెట్. రెచ్చిపోయి ఆడటానికి ఆ మాత్రం కారణాలు చాలు. పవర్ హిట్టింగ్కు కేరాఫ్ నిలిచిన ఐపీఎల్లో ఇప్పటిదాకా ఉన్న కొన్ని అరుదైన రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఎప్పుడో పుష్కర కాలం కిందట తానే నెలకొల్పిన రికార్డును రాజస్థాన్ రాయల్స్ తుత్తునీయలు చేసింది. సరికొత్త రికార్డును లిఖించింది. అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తనకు తిరుగు లేదని మరోసారి రాయల్గా నిరూపించుకుంది.
తొలి సీజన్లో దక్కన్ ఛార్జర్స్పై..
2008లో ఐపీఎల్ తొలి సీజన్లోనే అత్యధిక పరుగుల ఛేజ్ చేసిన రికార్డును తన పేరు మీద లిఖించుకుంది రాజస్థాన్ రాయల్స్. అప్పటి హైదరాబాదీ ఫ్రాంఛైజీ దక్కన్ ఛార్జర్స్పై దుమ్ము లేపింది. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరదను పారించింది. లీగ్ దశలో దక్కన్ ఛార్జర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో నమోదైన స్కోరే ఇప్పటిదాకా హయ్యెస్ట్గా నిలిచింది. దాన్ని బ్రేక్ చేసింది రాజస్థాన్. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు దక్కన్ ఛార్జర్స్ 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో అయిదు వికెట్లను మాత్రమే కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. ఏడు వికెట్లను కోల్పోయి. 217 పరుగులను సాధించింది. ఘన విజయాన్ని అందుకుంది.
మరోసారి తన రికార్డును తానే బద్దలు..
13 సంవత్సరాల తరువాత కూడా ఈ రికార్డు చెక్కు చెదరలేదు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ దాన్ని సవరించింది. తన రికార్డును తానే రాసుకుంది.. సరికొత్తగా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనతను సాధించింది. కేఎల్ రాహుల్ టీమ్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని కొట్టి అవతల పడేసింది. ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే 226 పరుగులను చేసింది. 19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులను సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నెలకొల్పిన తొలి రికార్డు బద్దలు కావడానికి 13 ఏళ్లు పట్టింది. దీన్ని బ్రేక్ చేయడానికి ఎన్నేళ్లు పడుతుందో వేచి చూడాల్సిందే.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన మ్యాచ్ల లిస్ట్లో చెన్నై సూపర్ కింగ్స్ సెకెండ్ పొజీషన్లో ఉంది. 2012లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని చెన్నై అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్.. ఎనిమది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు ఆ మ్యాచ్లో. ఆ టార్గెట్ను చెన్నై సూపర్ కింగ్స్ ఛేజ్ చేసింది. అయిదు వికెట్లను మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసింది. డుఫ్లెసిస్.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
2017 లో ఢిల్లీ డేర్ డెవిల్స్..
2017లో ఢిల్లీ డేర్ డెవిల్స్ హయ్యెస్ట్ టార్గెట్ను ఛేదించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో డీడీ ఈ రికార్డును నెలకొల్పింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ లయన్స్.. సురేష్ రైనా, దినేష్ కార్తీక్లు విజృంభించడంతో 208 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్.. సునాయసంగా ఆ లక్ష్యాన్ని అందుకుంది. 214 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 97 పరుగులు చేశాడా మ్యాచ్లో. సంజు శాంసన్ హాఫ సెంచరీ బాదాడు. వారిద్దరి బ్యాటింగ్ ప్రతాపానికి గుజరాత్ బౌలర్లు బేజారెత్తారు.
2014లో సన్ రైజర్స్పై
2014లో మరోసారి అత్యధిక పరుగులను బ్రేక్ చేసిన మ్యాచ్ను చూశారు క్రికెట్ ప్రేమికులు. సన్ రైజర్స్ హైదరాబాద్ నెలకొల్పిన 205 పరుగుల టార్గెట్ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఛేదించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిందీ మ్యాచ్. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్.. 205 పరుగుల లక్ష్యాన్ని తన ప్రత్యర్థి ముందు ఉంచింది. ఈ మ్యాచ్లో నమన్ ఓఝా హాప్ సెంచరీ హైలైట్. హైదరాబాద్ ఉంచిన టార్గెట్ను ఛేదించడానికి బరిలోకి దిగిన పంజాబ్ టీమ్.. నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో వృద్ధిమాన్ సాహా టాప్ స్కోరర్గా నిలిచాడు.