IPL 2020: బెంగళూరు అఫీషియల్ సాంగ్ పై భగ్గుమన్న ఫ్యాన్స్.. వెంటనే ఏం చేశారంటే..?
దుబాయ్: మరి కొన్ని గంటల్లో మెగా టోర్నమెంట్ ఐపీఎల్ గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టు అధికారిక గీతాన్ని విడుదల చేసింది. అయితే ఈ సాంగ్ పై కన్నడిగులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏం చేసింది..? ఇంతకీ ఈ స్టోరీ ఏంటో ఓ సారి చూసేద్దాం...
అఫీషియల్ సాంగ్ను విడుదల చేసిన బెంగళూరు జట్టు
ఐపీఎల్లో ఎప్పటికీ ఫేవరెట్ జట్లలో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంటుంది. కానీ ఎప్పుడూ విరాట్ జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ జట్టుకు మాత్రం లక్ కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ కోసమే అఫీషియల్ సాంగ్ ఒకటి విడుదల చేసింది. అయితే కొంత మంది అభిమానుల నుంచి పాటపై విమర్శలు వస్తున్నాయి.
బెంగళూరు ఫ్యాన్స్ నుంచి విమర్శలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం విడుదల చేసిన ఈ పాటలో లిరిక్స్ ఇంగ్లీషు, హిందీల్లో ఉండటంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్తో పాటు భారత మాజీ పేసర్ దొడ్డ గణేష్ కూడా విమర్శలకు తన గొంతు కలిపాడు. థీమ్ సాంగ్లో కన్నడ పదాలు తక్కువగా ఉండటంపై దొడ్డ గణేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ తప్పును సరిదిద్దుకుని మరో పాటను విడుదల చేసింది. ఈ సారి కన్నడ పదాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. థీమ్ సాంగ్లో కర్నాటక ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ ర్యాప్ భాగంను పూర్తి చేశాడు.
వైరల్గా మారుతోన్న వీడియో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రేడ్ మార్క్ గోల్డెన్ హెల్మెట్తో వీడియో ప్రారంభం అవుతుంది. బ్యాక్ గ్రౌండ్లో ఆర్సీబీ నినాదాలు హోరెత్తుతుండగా విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్ ఛార్జ్ అవుతునట్లుగా కనిపిస్తుంది. తాజా థీమ్ సాంగ్లో కన్నడ వెర్షన్ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. శనివారం నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుండగా బెంగళూరు జట్టు తొలి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్తో సెప్టెంబర్ 21న తలపడనుంది.
అదే ఊపు.. అదే ఉత్సాహం
ఇదిలా ఉంటే అభిమానులు లేకుండానే జరుగుతున్న మ్యాచుల్లో ఎక్కడా ఎనర్జీ లెవెల్స్ తగ్గవని అదే ఛార్జింగ్తో టోర్నీ జరుగుతుందని బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. అభిమానులను అలరించడంలో ఎక్కడ తగ్గమని కోహ్లీ వెల్లడించాడు. దుబాయ్ పరిసరాలకు, వాతావరణానికి జట్టు సభ్యులు అలవాటు పడ్డారని వండర్స్ క్రియేట్ చేసేందుకు తమ జట్టు సిద్దంగా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు ఉందని చెప్పిన విరాట్ కోహ్లీ అభిమానులు నిరుత్సాహ పడొద్దని పిలుపునిచ్చాడు.