IPL 2020: నా ఆటతో నేను ఆనందంగా లేను: రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్
దుబాయ్: తాను ఎంత గొప్ప ప్రదర్శన చేసినా సంతృప్తి చెందనని రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. మరింత మెరుగయ్యేందుకు ఇలా చేస్తానని పేర్కొన్నాడు. పరుగుల, వికెట్ల దాహం ఎప్పటికీ తీరనిదని చెప్పాడు. అనుభవం రావడం వల్లే ఉత్కంఠభరిత మ్యాచుల్లో రాణిస్తున్నానని స్టోక్స్ వెల్లడించాడు. తండ్రి అనారోగ్యం కారణంగా ఐపీఎల్ 2020లో లేటుగా అడుగుపెట్టిన స్టోక్స్.. రాజస్థాన్ జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లిన సమయంలో తన అద్భుత ఆటతో రాజస్థాన్ను రేసులోకి తీసుకొచాడు.
తాజాగా బెన్ స్టోక్స్ పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'అనుభవంతోనే అన్నీ సాధ్యమవుతాయి. ఎక్కువగా ఆడితే ఎక్కువగా నేర్చుకోవచ్చు. వేర్వేరు పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక ఆటగాడిగా నేనెప్పటికీ ఆనందంగా ఉండను. ఎక్కువ పరుగులు ఎలా చేయగలను, ఎక్కువ వికెట్లు ఎలా తీయగలనని ఆలోచిస్తా. నిత్యం మరింత మెరుగయ్యేందుకే ప్రయత్నిస్తుంటా. బలహీనతలను సరిచేసుకొనేందుకు ప్రయత్నించడంతోనే నిలకడ సాధ్యమవుతుంది. ఇదే నా విజయ రహస్యం. ఉత్కంఠక మ్యాచుల్లో కాస్త ఆందోళన ఉన్నా పద్ధతి ప్రకారం ఆడితే సరిపోతుంది' అని స్టోక్స్ అన్నాడు.
'ఆటగాడిగా నేర్చుకొనేందుకు ఐపీఎల్ ఒక అద్భుత వేదిక. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడొచ్చు. వారి ఆలోచనా విధానం తెలుసుకోవచ్చు. లీగుల్లో ఆడే ప్రతి బంతికీ ఉత్కంఠ ఉంటుంది. ఒకసారి దానికి అలవాటు పడితే.. ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలుస్తుంది. ఇక బయోబుడగ వాతావరణం ఫర్వాలేదు. కుటుంబానికి దూరంగా ఉంటామన్నది నిజమే. అయితే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కన్నా బుడగలో ఆడటం మంచిదని నా అభిప్రాయం' అని స్టోక్స్ చెప్పుకోచ్చాడు.
పంజాబ్ వరుస విజయాల జైత్రయాత్రకు రాజస్థాన్ బ్రేక్ వేసింది. రాజస్థాన్ శుక్రవారం పంజాబ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ శాంసన్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు.
లక్ష్య ఛేదనలో బెన్ స్టోక్స్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోవడంతో రాజస్థాన్కు అద్భుత ఆరంభం లభించింది. స్టోక్స్ ధాటికి రాయల్స్ 4.2 ఓవర్లలోనే 50 పరుగుల మైలురాయిని దాటింది. బౌండరీలు, సిక్సులు బాదుతూ పంజాబ్ బౌలర్లను భయపెట్టిన స్టోక్స్.. 26 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై స్టోక్స్ ఔట్ అయినా.. స్టీవ్ స్మిత్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు), జోస్ బట్లర్ (11 బంతుల్లో 22 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) మిగతా లాంఛనం పూర్తిచేశారు.