ఐపీఎల్ అంకెలతో కోహ్లీ ప్రదర్శనపై ఒక అంచనాకు రాలేం: సైమన్ కటిచ్
దుబాయ్: ఐపీఎల్ 2020లో విఫలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీపై ఓ వైపు విమర్శలు ఎదురవుతుంటే మరోవైపు ఆ జట్టు కోచ్ సైమన్ కటిచ్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2020 ప్రదర్శనను నంబర్స్తో నిర్ణయించలేమన్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచులో విరాట్ బాగా ఆడాడన్నాడు. కోహ్లీ లాంటి ప్రొఫెషనల్ ఆటగాడితో కలిసి పనిచేయడం తన అదృష్టమని కటిచ్ చెప్పాడు. తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు.. హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్లోనూ టైటిల్ సాధించాలనే కల నెరవేరలేదు.
శనివారం మీడియాతో మాట్లాడిన బెంగళూరు కోచ్ సైమన్ కటిచ్ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సీజన్లో తమ జట్టు బాగా ఆడిందని, కోహ్లీ సేవలు బెంగళూరుకు అవసరమని పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లీతో తొలిసారి పనిచేశాను. ఈ క్రమంలోనే అతడిలో ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ని, ప్రతి ఒక్కరూ గౌరవించే సారథిని చూశాను. అది కేవలం మైదానంలో వ్యవహరించే పరిస్థితుల వల్లనే కాదు.. బయట కూడా వారితో అంత కలివిడిగా ఉండడం వల్లనే సాధ్యమైంది. విరాట్ ఐపీఎల్ 2020 ప్రదర్శనను నంబర్స్తో నిర్ణయించలేం. చెన్నైతో జరిగిన మ్యాచులో విరాట్ బాగా ఆడాడు. కానీ మిగతా వారు విఫలమయ్యారు' అని చెప్పాడు.
'విరాట్ కోహ్లీతో పాటు అనుష్క శర్మ కూడా ఆటగాళ్లతో కలిసిపోయింది. మ్యాచ్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెప్టెన్ తన ఆటతీరుతో మిగతా 10 మందికి స్ఫూర్తి కలిగిస్తాడు. చివరి వరకూ పోరాడటం బెంగళూరుకే చెల్లింది. హైదరాబాద్తో మ్యాచ్లోనూ పోరాడాం. ఆ ప్రదర్శన పట్ల గర్వాంగా ఉంది. ఈ విషయంలో కెప్డెన్ కోహ్లీని మెచ్చుకోవాలి. యువ క్రికెటర్ దేవ్దత్ పడిక్కల్ రాణించడానికి గల కారణం కోహ్లీనే. ఈసారి మా జట్టులో సీనియర్లను జూనియర్లకు మెంటార్గా నియమించడం వల్ల సరైన ఫలితం వచ్చింది. కోహ్లీతో కలిసి సాధన చేయడం దేవ్దత్ కెరీర్కు ఉపయోగం. కోహ్లీ కెప్టెన్సీ బెంగళూరుకు ఉపయోగకరం' అని బెంగళూరు కోచ్ పేర్కొన్నాడు.
ప్రతి సీజన్ మాదిరిగానే 'ఈ సాలా కప్ నమదే' (ఈసారి కప్ మనదే) అంటూ ఐపీఎల్ లీగ్లో అడుగుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఆరంభంలో అదరగొట్టినా చివరి దశ కొచ్చేసరికి ఆకట్టుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడిన కోహ్లీసేన.. కీలకమైన ఎలిమినేటర్లో ఓడి మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమిపాలైంది. పుష్కర కాలంగా బలమైన జట్టుతో బరిలో దిగుతున్న బెంగళూరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ ముద్దాడలేకపోయింది.