ఎల్లో ఆర్మీ..అవమానకరంగా: ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్ నుంచి ధోనీసేన అవుట్: తొలి టీమ్గా
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్..ఓ జట్టు పతనానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. ఇలాంటిదొకటి జరుగుతుందని కల్లో కూడా ఊహించని అంశాన్ని వాస్తవం చేసింది. టీ20 ఫార్మట్లో గానీ, ఐపీఎల్ టోర్నమెంట్లో గానీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ పరాజయానికి సాక్షిగా నిలిచింది. భవిష్యత్తులో ఇదే జట్టు ఐపీఎల్లో కొనసాగే అవకాశాలు ఎంతమాత్రమూ ఉండకపోవచ్చు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ప్లేఆఫ్ రేస్ నుంచి అవుట్ కావడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.
Recommended Video
ఐపీఎల్-2020 నుంచి వైదొలగిన తొలి టీమ్గా..
ఐపీఎల్-2020 టోర్నమెంట్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అవమానకరంగా తిరుగుముఖం పట్టబోతోంది. ఇది అధికారికం. ఈ సీజన్లో ఈ మెగా టోర్నమెంట్ నుంచి వైదొలగిన తొలి జట్టుగా ఓ అన్వాంటెడ్ రికార్డ్ను నెలకొల్పింది. గత ఏడాది ఐపీఎల్ టోర్నీలో రన్నరప్గా నిలిచిన ఎల్లో ఆర్మీ.. ఈ సారి ప్లేఆఫ్ రేస్లో కూడా నిల్చోలేకపోయింది. ఐపీఎల్-2020 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకున్న ఆ జట్టు.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నట్టయింది. టోర్నీలో సీఎస్కే మరో రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉండగానే.. ప్లేఆఫ్ చేరే మార్గం మూసుకుపోయింది.
ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలా..?
అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. రికార్డు స్థాయి స్కోర్ను ఛేదించి అవతలపడేసింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలవడం.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బకొట్టింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి ఉంటే.. ధోనీ సేన తలరాత మరోలా ఉండేదేమో. ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే కొట్టేసింది. తన నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి ఎగబాకింది.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా...
నిజానికి- చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న తరువాత కూడా ఈ స్థాయిలో పరాభవాన్ని చవి చూడలేదా జట్టు. ఫిక్సింగ్ ఆరోపణల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్లో నిషేధానికి గురైన ఆ రెండేళ్ల సీజన్ను పక్కన పెడితే.. ప్రతీసారీ తనదైన ముద్రను వేస్తూ వచ్చింది. ఫిక్సింగ్ ఆరోపణలను ఎవరూ ఊహించని రీతిలో బౌన్స్ బ్యాక్ అయింది.. టోర్నమెంట్పై ఆధిపత్యాన్ని చలాయించింది. ప్రతీసారీ ప్లేఆఫ్లో అడుగు పెట్టింది. 2010, 2011, 2018ల్లో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. 2008, 2012, 2013, 2015, 2019ల్లో రన్నరప్గా నిలిచింది. ఐపీఎల్-2019 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ చిట్టచివరి స్థానం ఏదైనా ఉందంటే.. అది ఫోర్త్ ప్లేస్.
ఎనిమిదో స్థానంతోనే సరి..
ఇంత అద్భుతమైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సారి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకుంటుందని సగటు అభిమాని ఊహకు ఏ మాత్రం అందని విషయం. ఈ టోర్నమెంట్లో ఆ జట్టు ముందుకు సాగుతుందనే ఆశలు కూడా ఎవరికీ లేవు. అలాంటిదేదైనా జరిగితే.. అది అద్భుతమే అవుతుంది. ఈ టోర్నమెంట్లో ఏడు, లేదా ఎనిమిది స్థానాలతోనే సరిపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరో రెండు మ్యాచులను ఆడాల్సి ఉండగా.. విజయాలపై ఆశలు మాత్రం ఉండట్లేదు అభిమానులకు.