ఐపీఎల్ ఫైనల్కు చేరిన తెలుగోళ్ల టీమ్: ఉత్తరాంధ్ర నుంచి: పుష్కర కాలానికి బోణీ: ఛాంపియన్గా?
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో ఢిల్లీ కేపిటల్స్ బోణీ కొట్టింది. ఫైనల్లో అడుగు పెట్టింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. 2008లో ఐపీఎల్ ఆరంభమైన తరువాత.. ఇప్పటిదాకా ఆ జట్టు ఫైనల్ ముఖం చూడలేదు. దీన్ని తిరగరాసిందా టీమ్. రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ఐపీఎల్ ఆరంభమైన 12 సంవత్సరాల తరువాత ఫైనల్లో మ్యాచ్లో గ్రాండ్కు అడుగు పెట్టింది.
ఎదురుదాడే లక్ష్యంగా..
మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఢీ కొట్టబోతోంది. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను మట్టి కరిపించింది ఢిల్లీ కేపిటల్స్. బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్.. 189 పరుగులు చేసింది. కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్లందరూ దూకుడుగా ఆడారు. బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఓపెనర్లు మార్కస్ స్టోయినిస్, శిఖర్ ధావన్, మిడిలార్డర్లో షిమ్రోన్ హెట్మయిర్ విజృంభించారు. భారీ లక్ష్యాన్ని ముందుంచారు.
చివరికంటా పోరాడినా..
190 పరుగుల టార్గెట్ను అందుకునే ప్రయత్నంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత తడబడినప్పటికీ.. మిడిల్ ఓవర్లలో నిలకడగా రాణించింది. చివరికంటా పోరాడింది. ఓవర్ ఓవర్కూ రన్రేట్ పెరిగిపోతుండటంతో సన్రైజర్స్ బ్యాట్స్మెన్లు ఒత్తిడికి గురయ్యారు. భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్లో కేన్ విలియమ్సన్ ఒక్కడే క్రీజ్లో కుదురుకోగలిగాడు. భారీ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. కేన్ విలియమ్సన్-జేసన్ హోల్డర్, కేన్ విలియమ్సన్-అబ్దుల్ సమద్.. క్రీజ్లో ఉన్నంత సేపూ గెలుపుపై ఢోకా లేదనిపించింది. ఒక్క పరుగు తేడాతో మూడు వికెట్లను కోల్పోవాల్సి రావడంతో పరాజయం ఖాయమైంది.
జీఎంఆర్ గ్రూప్ భాగస్వామ్యం..
ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ ఓనర్.. జీఎంఆర్ గ్రూప్. ఈ ఫ్రాంఛైజీలో ఈ సంస్థకు 50 శాతం స్టేక్ ఉంది. మిగిలిన 50 శాతాన్ని జెఎస్డబ్ల్యూ సంస్థకు విక్రయించింది. మన రాష్ట్రానికి చెందిన గ్రంధి మల్లికార్జున రావుకు చెందిన సంస్థ ఇది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని రాజాం. 2008లో ఆయన ఢిల్లీ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశారు. ఢిల్లీ డేర్ డెవిల్స్గా.. అనంతరం ఢిల్లీ కేపిటల్స్గా మారిందా జట్టు పేరు. 2018లో 50 శాతం వాటాను జెఎస్డబ్ల్యూకు విక్రయించారు. అప్పుడే డేర్ డెవిల్స్ పేరును మార్చేశారు. కేపిటల్స్ను చేర్చారు. దేశీయంగా జీఎంఆర్కు టాప్ ఇన్ఫ్రా కంపెనీగా పేరుంది.
Recommended Video
84 మిలియన్ డాలర్ల పెట్టుబడి..
84 మిలియన్ డాలర్ల పెట్టుబడితో జీఎంఆర్ సంస్థ 2008లో ఢిల్లీ కేపిటల్స్ను కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో నాలుగో అత్యంత ఖరీదైన జట్టుగా పేరుంది. ముంబై ఇండియన్స్-111.9, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-111.9, చెన్నై సూపర్ కింగ్స్-91 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఉంది. 2018లో 50 స్టేక్ను జెఎస్డబ్ల్యూకు విక్రయించారు. జీఎంఆర్ సంస్థకు ఇదొక్కటే కాదు.. ప్రొ కబడ్డీ లీగ్ టీమ్ను కూడా కొనుగోలు చేసింది. యూపీ యోద్ధ జట్టు జీఎంఆర్దే. ఢిల్లీ కేపిటల్స్ బ్రాండ్ వ్యాల్యూ 374 కోట్ల రూపాయలు.